Raja Singh : గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తన రాజకీయ భవిష్యత్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేయాలని భావిస్తున్నానని స్పష్టం చేశారు. బీజేపీ టిక్కెట్ ఇవ్వకుంటే రాజకీయాలు వదిలేస్తానని తేల్చిచెప్పారు.
ఇతర పార్టీల్లో తాను చేరే ప్రసక్తి లేదని రాజాసింగ్ క్లారిటీ ఇచ్చారు. బీఆర్ఎస్, కాంగ్రెస్లో చేరేదిలేదన్నారు. తన ప్రాణం పోయినా ఫర్వాలేదుగానీ.. అలాంటి పార్టీల్లో చేరనని స్పష్టం చేశారు. బీఆర్ఎస్, ఎంఐఎంపైనా తీవ్ర విమర్శలు చేశారు. గోషామహల్ బీఆర్ఎస్ టిక్కెట్ మజ్లిస్ చేతిలో ఉందని విమర్శించారు. మజ్లిస్ నిర్ణయం కోసమే గోషామహల్ స్థానాన్ని కేసీఆర్ పెండింగ్లో పెట్టారని మండిపడ్డారు. గోషామహల్ బీఆర్ఎస్ టిక్కెట్ ఎవరికి ఇవ్వాలో దారుసలామ్ లో నిర్ణయిస్తారని ఆరోపించారు.
బీజేపీ అధిష్ఠానం తనపై సానుకూలంగా ఉందని రాజాసింగ్ తెలిపారు. సరైన సమయంలో తనపై సస్పెన్షన్ను ఎత్తివేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. అలా జరగపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని క్లారిటీ ఇచ్చారు. కానీ ఇండిపెండెంట్గాని, ఇతర పార్టీల నుంచి కానీ పోటీ చేయనని తేల్చిచెప్పేశారు.