Heavy Rains in Hyderabad: రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో బుధవారం వర్షం కురిసింది. సాయంత్రం ఒక్కసారిగా మేఘాలు కమ్ముకున్నాయి. వీటికి తోడుగా ఈదురుగాలులు, ఉరుములతో కూడిన వర్షం ప్రారంభమయ్యింది. పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసింది. మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.
నాంపల్లి, అబిడ్స్, లిబర్టీ, బషీర్ బాగ్, నారాయణగూడ, హిమాయత్ నగర్, ట్యాంక్ బండ్, పంజాగుట్ట, కండ్లకోయ, మేడ్చల్, దుండిగల్, గండిమైసమ్మ, గచ్చిబౌలి, మెహిదీపట్నం, పాతబస్తీ, చార్మినార్, చంద్రాయణగుట్ట, లింగంపల్లి, బహదూర్ పురా, కొండాపూర్, మాదాపూర్, మియాపూర్, ఫలక్ నుమా, ఉప్పుగూడ, ఎల్బీనగర్, అబ్దుల్లాపూర్ మెట్, శేరిలింగంపల్లితో పాటు పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. కేపీహెచ్ బీ, నిజాంపేట్, కూకట్ పల్లి, బాచుపల్లి, జగద్గిరిగుట్ట, బోరబండలో ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. ఆ ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. రోడ్లపైకి వరద నీరు వచ్చి చేరింది.
సాయంత్రం వేళ నగరంలో వర్షం కురవడంతో పనికి వెళ్లి ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్లే ఉద్యోగులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. భారీగా వర్షం పడడంతో పలు ప్రాంతాల్లో వాహన రాకపోకలు స్తంభించిపోయాయి. ఇంకొన్ని ప్రాంతాల్లో గంటకుపైగా వాహనాలు ఎక్కడికక్కడా నిలిచిపోయాయి. జూబ్లీహిల్స్ నుంచి హైటెక్ సిటీ వెళ్లే మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.
భారీగా వర్షం పడడంతో రోడ్లపైకి వరద నీరు వచ్చి చేరింది. దీంతో రోడ్లు చెరువులను తలపించాయి. పలు ప్రాంతాల్లో నాలాలు, మ్యాన్ హోల్స్ పొంగిపొర్లాయి. జీహెచ్ఎంసీ సిబ్బంది వర్షపు నీటిని తొలగించారు. పలు చోట్లా ట్రాఫిక్ జామ్ కావడంతో ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ ను క్లియర్ చేశారు.
నాంపల్లి బేగంబజార్ లో అత్యధికంగా 8.5 సెం. మీ. వర్షపాతం నమోదైనట్లు తెలుస్తోంది. బండ్లగూడ కందికల్ గేట్ లో 8.13 సెం. మీ., చార్మినార్ లో 7.98 సెం.మీ., కూకట్ పల్లిలో 7.58 సెం.మీ., ఖైరతాబాద్ లో 7.40 సెం. మీ, శేరిలింగంపల్లిలో 4.63 సెం.మీ, వర్షపాతం నమోదైనట్లు సమాచారం.
Also Read: ఫోన్ ట్యాపింగ్ కేసును సుమోటోగా తీసుకున్న హైకోర్టు.. వాళ్లకు నోటీసులు జారీ
అదేవిధంగా రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో కూడా వర్షం కురిసింది. సంగారెడ్డి జిల్లాలో కుండపోత వర్షం కురిసింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఈదురగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. కొద్దిసేపు వడగండ్లు కూడా పడ్డాయి. . రంగారెడ్డి జిల్లాలో పిడుగుపాటుతో ఓ వ్యక్తి మరణించినట్లు సమాచారం. మరోవైపు తెలంగాణలో రాగల మూడు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ సూచించినట్లు సమాచారం. అదేవిధంగా పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు కూడా జారీ చేసినట్లు తెలుస్తోంది.