Telugu States heavy rains alert: తెలంగాణ, ఏపీలో రానున్న మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. ఉత్తర బంగాళాఖాతంలో మరో అల్పపీడం ప్రభావం ఏర్పడింది. దీంతో కోస్తా జిల్లాతోపాటు హైదరాబాద్, పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారతీయ వాతావరణ కేంద్రం తెలిపింది.
రానున్న మూడు నుంచి నాలుగు రోజులు జోరుగా వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఈ మేరకు రాష్ట్రంలోని 16 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
ఆసిఫాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపలపల్లి, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నారాయణపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
మిగతా జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వివరించింది. పలు చోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని హెచ్చరించింది.
Also Read: మనల్ని ఎవడ్రా ఆపేది..!.. ఎన్ కన్వెన్షన్ కూల్చివేత.. పూర్వపరాలు
ఇదిలా ఉండగా, గత వారం రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు హైదరాబాద్ తడిసిముద్దయింది. దీంతో నగరవాసులు వణికిపోతున్నారు. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న ప్రాంతాల్లో స్కూళ్లకు సెలవులు ఇచ్చే అంశంపై కూడా ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు సూచిస్తున్నారు.