Rain Alert In Telangana: రానున్న 48 గంటల్లో తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. కొన్ని చోట్ల మొరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని, మరి కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. పశ్చిమ విదర్బ దాని పరిసర ప్రాంతాల్లో సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కేంద్రీకృతం అయి ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీంతో పలు జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
కిందిస్థాయి గాలులు దక్షిణ ఆగ్నేయ దిశ నుంచి రాష్ట్రం వైపునకు వీస్తున్నందున రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం, బుధవారం ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ ఉపరితల ఆవర్తన ప్రభావం కారణంగా వాతావరణ శాఖ పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. దీని ప్రభావంతో ఈ రోజు(మంగళవారం) ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, ఆదిలాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. గంటకు 30 – 40కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని ప్రజలు జాగ్రత్తగా ఉండాలను సూచించారు.
Also Read: IT Raids in Hyderabad : హైదరాబాద్లో ఐటీ దాడులు.. చట్నీస్ యజమాని ఇంట్లో సోదాలు
బుధవారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశముందని హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న వాతావరణ కేంద్రం పేర్కొంది. ఈ ఉపరితల ఆవర్తనం కారణంగా రాష్ట్రవ్యాప్తంగా వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు చోటుచేసుకున్నాయి.
మరోవైపు ఏపీలోనూ భారీ వర్షాలు కురుస్తాయని విజయవాడ కేంద్రంగా పనిచేస్తున్న వాతావరణ శాఖ వెల్లడించింది. బుధవారం కోస్తాంధ్రలో 6 నుంచి 12 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వారు తెలిపారు. విజయవాడ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించిన వివరాల మేరకు.. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు, ఉమ్మడి కృష్ణా, ఏలూరు, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, అల్లూరి జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయన్నారు.