Rail: వందేభారత్ ఎక్స్ప్రెస్. ప్రధాని మోదీ ప్రతిష్టాత్మకంగా ప్రారంభిస్తున్న రైళ్లు. హైస్పీడ్ ట్రైన్తో వేగంగా ప్రయాణించే అవకాశం. లోపల సదుపాయాలు లగ్జరీగా ఉంటాయి. అందుకే, వందేభారత్ రైల్ క్రెడిట్ను తన ఖాతాలో వేసుకుంటోంది కేంద్రం. అయితే, బీజేపీ-మోదీపై కోపం ఉన్నవారంతా వందేభారత్ ఎక్స్ప్రెస్ను టార్గెట్ చేస్తున్నారు. కళ్లమంటో ఏంటో తెలీదు కాని.. ఇటీవల వందేభారత్ రైల్పై రాళ్ల దాడులు బాగా పెరుగుతున్నాయి.
ఇతర రాష్ట్రాలతో పాటు తెలుగు స్టేట్స్లోనూ రాళ్ల దాడి ఘటనలు జరుగుతున్నాయి. అందుకే, ఇది ఇలానే వదిలేస్తే మరింత ఓవర్ చేస్తారని భావించిన రైల్వే శాఖ.. కఠిన శిక్షలు అమలు చేసేందుకు రెడీ అవుతోంది. బూజు పట్టిన నిబంధనలను బయటకు తీసి సాన బెట్టింది. రైళ్లపై రాళ్లు విసరడం వంటివి చేస్తే ఐదేళ్ల వరకు జైలు శిక్ష పడుతుందని దక్షిణ మధ్య రైల్వే వార్నింగ్ ఇచ్చింది. ప్రయాణికులకు, రైల్వే ఆస్తులకు నష్టం కలిగించే చర్యలకు దిగకూడదని తేల్చి చెప్పింది.
కొందరు పోకిరీలు ఉంటారు. రైల్వే ట్రాకులపై మద్యం సేవిస్తూ, పేకాట ఆడుతూ, కబుర్లు చెప్పుకుంటూ టైమ్పాస్ చేస్తుంటారు. అలాంటి వాళ్లే ఆకతాయితనంతో రైళ్లపై రాళ్లు విసురుతుంటారు. అదో టైప్ శాడిజం వారిది. అలా రాళ్లు విసిరితే.. పలువురు ప్రయాణికులకు అవి తగిలి గాయపడిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు.. ఏపీ, తెలంగాణలో 9 రాళ్లు విసిరిన కేసులు నమోదయ్యాయి. భువనగిరి, కాజీపేట, ఖమ్మం, ఏలూరు, రాజమహేంద్రవరం తదితర ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు జరిగాయి. ఈ దాడుల్లో అయిదుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ఆ కేసుల్లో 39 మందిని అరెస్టు చేసి జైలుకు పంపించారు రైల్వే అధికారులు.
అందుకే మరి, రైలే కదాని రాయి విసిరితే.. ఐదేళ్లు జైల్లో వేస్తారు జాగ్రత్త.