Rahul Gandhi : పెద్దపల్లి బహిరంగ సభలో రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విమనాస్త్రాలు సందించారు. తెలంగాణ వస్తే తనకు ఎంతో సంతోషంగా ఉంటుందంటూ రాహుల్ స్పీచ్ మొదలు పెట్టారు. తెలంగాణతో ఉన్న సంబంధం రాజకీయ సంబంధం కాదన్నారు. కుటుంబంతో ఉన్న అనుబంధంగా పేర్కొన్నారు. నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలకు తెలంగాణతో మంచి అనుబంధ ఉండేదన్నారు. తెలంగాణలో ఇస్తామని 2004లోనే కాంగ్రెస్ ప్రకటించిందన్నారు. అప్పుడు ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలని సోనియా గాంధీ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు.
తెలంగాణను ఏర్పాటు చేయాలని సోనియా గాంధీ నిర్ణయం తీసుకున్నప్పుడు రాజకీయంగా నష్టం జరుగుతుందని తెలుసన్నారు. కానీ తెలంగాణలోని పేదలు, రైతుల కోసం రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారని వివరించారు. రాష్ట్రం ఏర్పడిన పదేళ్ల తర్వాత కూడా ప్రజల కల, సోనియా కలను కేసీఆర్ నెరవేర్చలేదని విమర్శించారు.
ఇప్పుడు రాష్ట్రంలో దొరల తెలంగాణ, ప్రజల తెలంగాణ మధ్య ఈ ఎన్నికలు జరగబోతున్నాయని రాహుల్ అన్నారు. ఒకవైపు సీఎం, ఆయన కుటుంబ సభ్యులు ప్రభుత్వంలో శాఖలను కంట్రోల్ లో పెట్టుకున్నాయని మండిపడ్డారు. తెలంగాణలో భూములు తమ ఆధీనంలో ఉంచుకున్నారని ఆరోపించారు. కేసీఆర్ ఒక సీఎం లాగా కాకుండా రాజులా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయం పెంచి లక్ష కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. కానీ రైతులకు లాభం చేకూరలేదని.. కాంట్రాక్టర్లకే ప్రయోజనం కలిగిందన్నారు.
ధరణి పోర్టల్ ద్వారా ప్రజల భూములను సీఎం లాక్కున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు. భూముల రికార్డుల మార్చి పేదల భూములను తీసేసికున్నారని విమర్శించారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఎంతమందికి వచ్చాయని ప్రశ్నించారు. లక్ష రూపాయల రైతు మాఫీ అమలు చేశారని నిలదీశారు. పెద్ద పెద్ద రైతులకే రైతుబంధుతో లాభం జరుగుతోందని తెలిపారు.
సింగరేణి మైన్స్ ప్రైవేటీకరణ కాకుండా చూస్తామని రాహుల్ గాంధీ స్పష్టంచేశారు. ఆ మైన్స్ అదానీకి అమ్మే ప్రయత్నం జరిగిందన్నారు. సింగరేణి కార్మికుల కాంగ్రెస్ పార్టీ రక్షణగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. దళితులకు , గిరిజనులకు 3 ఎకరాలు ఇస్తానని కేసీఆర్ మోసం చేశారని రాహుల్ మండిపడ్డారు. 15 లక్షల రూపాయలు బ్యాంక ఖతాల్లో వేస్తానని మోదీ మోసం చేశారని గుర్తు చేశారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందని స్పష్టం చేశారు. కర్నాటక, రాజస్థాన్, చత్తీస్ గఢ్ లో చెప్పిన మాటను కాంగ్రెస్ నిలబెట్టుకుందని తెలిపారు. తెలంగాణలోనూ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తొలిరోజే హామీలను నెరవేరుస్తామన్నారు.
బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం మూడు ఒక్కటేనని రాహుల్ గాంధీ అన్నారు. బీజేపీ, ఎంఐఎంకు ఓటు వేస్తే బీఆర్ఎస్ కు ఓటు వేసినట్లేనని స్పష్టం చేసారు. తనపై 26 కేసులున్నాయని.. లోక్ సభ సభ్యత్వం రద్దు చేశారని ఇంటిని లాక్కున్నారని తెలిపారు. కేసీఆర్ పై ఎలాంటి సీబీఐ, ఐటీ, ఈడీ కేసులు పెట్టలేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై ఎలాంటి విచారణ చేపట్టలేదని.. అందుకే ఇక్కడ బీఆర్ఎస్ ను కేంద్రంలో బీజేపీని ఓడించాలని రాహుల్ పిలుపునిచ్చారు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వేవ్ బలంగా ఉందని రాహుల్ గాంధీ విశ్వాసం వ్యక్తం చేశారు. తెలంగాణలో ప్రజల ప్రభుత్వం ఏర్పాటు ఖాయమని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సునామీ రాబోతోందని జోస్యం చెప్పారు.