Rahul Gandhi : దొరల తెలంగాణ.. ప్రజల మధ్య ఎన్నికల్లో పోటీ జరుగుతుందని రాహుల్ గాంధీ అన్నారు. కలకుర్తిలో బహిరంగ సభలో పాల్గొన్న రాహుల్ .. బీఆర్ఎస్ ప్రభుత్వం విమర్శనాస్త్రాలు సంధించారు. ఒకవైపు సీఎం కేసీఆర్ కుటుంబ, అవినీతి మంత్రులు ఉన్నారని.. మరోవైపు రైతులు, పేదలు , విద్యార్థులు ఉన్నారని వివరించారు. తెలంగాణ అభివృద్ధి కోసం ప్రజలు కల కన్నారని అయితే అది నిర్వీర్యం అయిపోయిందన్నారు. కేసీఆర్ సీఎంలాగా కాకుండా రాజులా ప్రజలపై పెత్తనం చెలాయిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వంలోనే ఆదాయనిచ్చే శాఖలన్నీ కేసీఆర్ కుటుంబం చేతిలో ఉన్నాయని విమర్శించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు కోసం అంచనాలు పెంచిపెంచి పేదల జేబుల్లోంచి లక్ష కోట్లు కేసీఆర్ లాగారని రాహుల్ ఆరోపించారు. కేసీఆర్ ప్రాజెక్టుకు వద్దకు వెళ్లి సమీక్షించాలన్సి అవసరం ఉందని సూచించారు. కాళేశ్వరం పిల్లర్లు కూలిపోతున్నాయని లక్ష కోట్లు దోచేశారని మండిపడ్డారు. కేసీఆర్ ఒక్క ప్రాజెక్టును కూడా సరిగ్గా కట్టలేదని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారని విమర్శించారు.
నాగార్జునసాగర్, జురాల, సింగూరు ఇలా అన్నీ ప్రాజెక్టులు కాంగ్రెస్ హయాంలో నిర్మించినవేనని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. కాంగ్రెస్ హయాంలో దళితులకు, గిరిజనులు , బడుగు బలహీన వర్గాలకు భూమలిచ్చామని గుర్తు చేశారు. కానీ దొరల ప్రభుత్వం ధరణి పోర్టల్ పేరుతో పేదల భూములు లాక్కుంటోందన్నారు. దీని 20 లక్షల మంది రైతులకు నష్టం జరుగుతోందన్నారు. ఒక వ్యక్తి మాత్రమే మేలు జరుగుతోందని కేసీఆర్ విమర్శలు చేశారు. అందుకే కేసీఆర్ ను ఓడించాలని పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక.. కేసీఆర్ తెలంగాణ ప్రజల నుంచి చేసిన లూటీపై ప్రశ్నిస్తామన్నారు. ఎంత అయితే పేదల వద్ద కేసీఆర్ లూటీ చేశారో ఆ డబ్బుల పేదల జేబులోకి నింపుతామన్నారు. తాను నరేంద మోదీని కాదని హామీ ఇస్తే నెరవేర్చే బాధ్యత తనదేనని తేల్చిచెప్పారు. మోదీ 15 లక్షల పేదల ఖాతాల్లో వేస్తానని మోసం చేశారని మండిపడ్డారు. ఒక్క రూపాయి కూడా పేదలకు ఇవ్వలేదని.. అదానీ బ్యాంకు అకౌంట్ లోకి లక్షల కోట్లు చేరాయని ఆరోపించారు. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలను మరోసారి రాహుల్ గాంధీ గుర్తు చేశారు.
బీఆర్ఎస్ , బీజేపీ, ఎంఐఎంలపై విమర్శనాస్త్రాలను రాహుల్ గాంధీ సంధించారు. పార్లమెంట్ లో బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి మద్దతు ఇచ్చిందన్నారు. రైతు చట్టాల బిల్లు, జీఎస్టీ, నోట్ల రద్దుపై బీఆర్ఎస్ మద్దతు ఇచ్చిందని తెలిపారు. మోదీ.. ప్రతిపక్ష నేతలపై అనేక కేసులు పెట్టారని మండిపడ్డారు. తనపై 24 కేసులు పెట్టారని తెలిపారు. తన లోక్ సభ సభ్యత్వం రద్దు చేశారని ప్రభుత్వ ఇచ్చిన ఇల్లును లాక్కుకున్నారని వివరించారు. కానీ బీఆర్ఎస్ నేతలపై మాత్రం ఏ కేసులు ఉండవన్నారు. సీబీఐ, ఈడీ, ఐటీ వాళ్ల ఇంటికి వెళ్లరని తెలిపారు. మోదీ, కేసీఆర్ కలిసి పనిచేస్తున్నారని విమర్శించారు.
తెలంగాణలో బీజేపీని కాంగ్రెస్ తుడిపెట్టిందని.. ఆ పార్టీకి ఇక్కడ 2 శాతం ఓట్లు ఉన్నాయని రాహుల్ సెటైర్ల వేశారు. ఆ ఓట్లతో సీఎం పదవి వస్తుందా అని పంచులు వదిలారు. ఎంఐఎం బీజేపీకి అనుకూలం ఉందని ఆరోపించారు. మహారాష్ట్ర, రాజస్థాన్ , యూపీలో ఎంఐఎం అభ్యర్థులు.. బీజేపీకి సహాయ పడానికే పోటీ చేస్తున్నారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ , మధ్యప్రదేశ్ , రాజస్థాన్, చత్తీస్ గెలుస్తామని రాహుల్ విశ్వాసం వ్యక్తం చేశారు. 2024 ఎన్నికల్లో ఢిల్లీలో గెలుస్తామని స్పష్టం చేశారు. తొలుత బీఆర్ఎస్ ను ఓడిద్దాం తర్వాత ఢిల్లీలో బీజేపీ పనిపడదాం అని పిలుపునిచ్చారు.