Rahul Gandhi : తెలంగాణలో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ అడుగులు ముందుకు వేస్తోంది. ఎన్నికల ప్రచారం హోరెత్తిస్తోంది. బుధవారం ములుగు బహిరంగ సభ సక్సెస్ తో పార్టీలో మరింత జోష్ వచ్చింది. ఇదే దూకుడుతో కాంగ్రెస్ బస్సు యాత్ర సాగుతోంది. బీజేపీ, బీఆర్ఎస్ టార్గెట్ గా రాహుల్ గాంధీ విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. బీఆర్ఎస్ ఒంటరి పార్టీ కాదన్నారు. గులాబీ పార్టీతో బీజేపీ, ఎంఐఎం కలిసే ఉన్నాయని విమర్శించారు.
తాను బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్నానని రాహుల్ గాంధీ తెలిపారు. అందుకే ఎన్నో కేసులు పెట్టారని మండిపడ్డారు. తన లోక్ సభ సభ్యత్వాన్ని, ఇంటిని లాకున్నారని మండిపడ్డారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బీజేపీకి మద్దతు ఇస్తున్నారని తెలిపారు. అందుకే సీబీఐ, ఈడీలు కేసీఆర్ వెంటపడవన్నారు. ఎంఐఎం దేశవ్యాప్తంగా ఎన్నికల్లో పోటీ చేసి బీజేపీకి సహాయ పడుతోందని ఆరోపించారు.
బీజేపీతో పోరాడుతున్నానని తన డీఎన్ఏ నిరంతరం గుర్తు చేస్తోందని రాహుల్ గాంధీ అన్నారు. బీజేపీకి మద్దతు ఇచ్చే వారు తనపై విమర్శలు గుప్పిస్తుంటే తన పోరాటం సవ్యంగా సాగుతోందని అర్థం అవుతోందన్నారు. అది తనకెంతో సంతోషాన్ని కలిగిస్తోందన్నారు.
పార్లమెంట్లో ఓబీసీ జనాభా ఎంత అని నిలదీశానని రాహుల్ చెప్పుకొచ్చారు. దేశాన్ని 90 మంది అధికారులు పరిపాలిస్తున్నారని వివరించారు. అందులో ఓబీసీలు కేవలం ముగ్గురేనని తెలిపారు. అందుకే దేశానికి ఎక్స్రే అవసరమన్నారు. డాక్టర్ దగ్గరకు వెళితే ఏ రోగమో తెలుసుకునేందుకు ముందు ఎక్స్రే తీసుకు రమ్మంటారని.. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ముందుగా ఎక్స్రే తీసే పని చేస్తామన్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ హవా కొనసాగుతోందని రాహుల్ గాంధీ విశ్వాసం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు ఖాయమన్నారు. ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తీరుతామని స్పష్టంచేశారు.