Rahul Gandhi : తెలంగాణలో గురువారం కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో వాగ్ధానాలను నెరవేర్చుతామని స్పష్టం చేశారు.
రేవంత్రెడ్డి నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం నిర్మాణం అవుతుందని రాహుల్ గాంధీ తెలిపారు. ఇచ్చిన హామీలను నెరవేర్చటమే లక్ష్యమని చెప్పారు. తెలంగాణలో ప్రజల ప్రభుత్వం ఏర్పాటవుతుందన్నారు.
తెలంగాణ ఎన్నికలపై రాహుల్ గాంధీ మొదటి నుంచి ఎంతో దృష్టిపెట్టారు. తెలంగాణలో భారత్ జోడో యాత్ర చేశారు. వరంగల్ లో రైతు డిక్లరేషన్ ప్రకటించారు. రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. ఆ తర్వాత తరచూ తెలంగాణలో పర్యటనలు చేశారు. ములుగు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారాన్ని సోదరి ప్రియాంక గాంధీతో కలిసి ప్రారంభించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. కాళేశ్వర ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. కాంగ్రెస్ కు అధికారమిస్తే ఏం చేస్తామో చెప్పారు.
ఆ తర్వాత పలు సభల్లో రాహుల్ పాల్గొన్నారు.ఎన్నికల ప్రచారం చివరి రోజు హైదరాబాద్ లో రోడ్ షో నిర్వహించారు. ఇలా కాంగ్రెస్ లో కొత్త ఉత్సాహాన్ని నింపారు. అదే దూకుడుతో కాంగ్రెస్ ప్రచారం సాగింది. తెలంగాణలో అధికారం సాధించింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న నేపథ్యంలో ఇచ్చిన హామీలపై తమకున్న చిత్తశుద్ధి గురించి రాహుల్ ప్రకనట చేశారు.