Congress Vijaya Bheri Yatra : తెలంగాణ రాహుల్ గాంధీ మూడవ రోజు పర్యటిస్తున్నారు. కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహిస్తున్న విజయభేరి బస్సుయాత్ర మూడవ రోజు జగిత్యాలకు చేరుకుంది. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. తెలంగాణకు కేసీఆర్ ఒక నియంత రాజులా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. డిసెంబర్ 3న తెలంగాణలో కాంగ్రెస్ జెండా ఎగిరితే.. పసుపు రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తామని హామీ ఇచ్చారు. క్వింటాల్ పసుపుకు రూ.12000 వరకూ మద్దతు ధర ఇస్తామన్నారు. అలాగే ధాన్యానికి, అన్ని వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధర రూ.500 అధికంగా కల్పించేందుకు కృషిచేస్తామన్నారు. తెలంగాణ ప్రజలతో కాంగ్రెస్ కు ప్రేమ, అనుబంధం ఉందని.. ఈ అనుబంధం దశాబ్దాల నాటిదన్నారు. నవంబర్ 30న దొరల తెలంగాణ, ప్రజల తెలంగాణకు మధ్య ఎన్నికలు జరగనున్నాయన్న రాహుల్.. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ కుటుంబ పాలనకు స్వస్తి పలకాలన్నారు.
మండుటెండను కూడా లెక్కచేయకుండా తనమాటలు వినేందుకు వచ్చిన ప్రజలకు రాహుల్ కృతజ్ఞతలు తెలిపారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని మరోసారి రాహుల్ విమర్శించారు. కేంద్రంలో ఉన్న బీజేపీకి బీఆర్ఎస్ మద్దతిస్తోందని ఎద్దేవా చేశారు. లోక్ సభలో ప్రవేశపెట్టిన అన్ని బిల్లులకూ బీఆర్ఎస్ మద్దతిచ్చిందన్నారు. తనకు లోక్ సభ సభ్యత్వం పోయిన తర్వాత ఢిల్లీలో తన ఇంటిని ఖాళీచేయించిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ఢిల్లీలో ఇంటిని ఖాళీ చేయించినా.. దేశ ప్రజల హృదయాల్లో ఉన్న ఇంటిని ఎవరూ ఖాళీ చేయించలేరన్నారు.
దేశానికి ఓబీసీలు వెన్నెముక లాంటివారన్న రాహుల్.. రాష్ట్రంలో ఓబీసీలకు రిజర్వేషన్లు ఇచ్చేందుకు కేసీఆర్ ప్రభుత్వం ముందుకు రావడం లేదన్నారు. ఓబీసీలకు అండగా నిలిచేందుకు మోదీ, కేసీఆర్ సిద్ధంగా లేరని దుయ్యబట్టారు. అటు దేశంలో, ఇటు రాష్ట్రంలో ఎంతమంది ఓబీసీలు ఉన్నారో ఎందుకు లెక్కలు తీయరని రాహుల్ ప్రశ్నించారు. దేశాన్ని నడిపించే అధికారుల్లో 90 శాతం మంది అగ్రకులాలకు చెందినవారే ఉన్నారని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోగానే కులగణన చేపట్టి.. ఓబీసీలకు, బలహీన వర్గాల వారికి తమ హక్కులను కల్పిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రజలు వేలకోట్ల పన్నులు కడుతున్నా.. ప్రభుత్వం ఆ సొమ్మంతా దోచుకుంటోందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటంతోనే.. రాష్ట్రంలో చక్కెర కర్మాగారాలను పునఃప్రారంభించి రైతులకు మద్దతుగా నిలుస్తామన్నారు.