Rahul Gandhi : తెలంగాణలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారానికి శంఖారావం పూరించారు రాహుల్ గాంధీ. రెండవరోజు ప్రచారంలో భాగంగా నిర్వహించిన భూపాలపల్లి ర్యాలీలో రాహుల్, ప్రియాంక గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలు రాజ్యాధికారం చేపట్టాలని ఆశించామన్నారు. రాష్ట్రంలో అధికారం ఒకే కుటుంబానికి పరిమితమైందని, అందుకే కేసీఆర్ ప్రజలకు దూరమవుతున్నారన్నారు. దేశంలోని అవినీతి ప్రభుత్వం తెలంగాణలోనే ఉందని రాహుల్ ఎద్దేవా చేశారు. నవంబర్ 30న దొరల తెలంగాణ, ప్రజల తెలంగాణకు మధ్య ఎన్నికలు జరగనున్నాయని, డిసెంబర్ 3న ప్రజల తీర్పు తెలుస్తుందని అన్నారు.
కేంద్రంలో ఉన్న బీజేపీ తెచ్చిన ప్రతి చట్టానికీ బీఆర్ఎస్ మద్దతు తెలిపిందన్న రాహుల్.. కేసీఆర్ అవినీతిపై ఈడీ, సీబీఐ ఎందుకు విచారణ జరపడం లేదని ప్రశ్నించారు. పార్లమెంట్ లో కులగణన ప్రస్తావన తీసుకొస్తే.. కేంద్రం స్పందించకపోవడాన్ని తప్పుపట్టారు. ఇప్పటికి కూడా దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాల్సిన అవసరం ఉందని, కులగణన చేయడంలో తప్పలేదని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
దేశపరిపాలనలో అందరినీ భాగస్వామ్యం చేస్తేనే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. కేవలం 5 శాతం మంది అధికారులు మాత్రమే బడ్జెట్ ను నియంత్రిస్తున్నారని రాహుల్ ఆరోపించారు. అదానీ తీసుకున్న అప్పులన్నింటినీ మాఫీ చేస్తున్న బీజేపీ.. స్వయం ఉపాధి కింద మహిళలు తీసుకున్న రుణాలను మాత్రం మాఫీ చేయడం లేదని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ప్రజలు కొనుగోలు చేసే ప్రతి వస్తువుపై బీజేపీ జీఎస్టీ వసూలు చేసి.. దానిని అదానికి కట్టబెడుతున్నారని ఆరోపణలు చేశారు. సీఎం కేసీఆర్, ఆయన కుటుంబం ప్రజా సంపదను ఎలా దోచుకుందో త్వరలోనే ప్రజల ముందు ఉంచుతామన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. పేదలు, రైతుల సర్కార్ ను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.