హైదరాబాద్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం కొనసాగుతుంది. నగరంలో వివిధ వర్గాలతో రాహుల్ భేటీ అవుతున్నారు. అందులో భాగంగా జూబ్లీహిల్స్ లో డెలివరీ బాయ్స్, శానిటరీ వర్కర్స్ తో రాహుల్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాహుల్ కు వారి తమ సమస్యలను చెప్పుకున్నారు. తమకు ఈఎస్ఐ, పీఎఫ్ వంటి సౌకర్యాలు కల్పించేలా చూడాలని కోరారు. సంపాదించనదంతా పెట్రోల్ కే పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. డబుల్ బెడ్ రూమ్, పెన్షన్లు ఇవ్వడం లేదని శానిటరీ వర్కర్స్ తమ సమస్యలను రాహుల్ ముందు ఏకరవు పెట్టారు.
తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతుండటంతో తీవ్రంగా నష్టపోతున్నామని, ప్రమాద బీమా కల్పించాలని విజ్ఞప్తి చేశారు. డ్యూటీలో ఉండగా తమను పోలీసులు చలాన్ల పేరుతో వేధిస్తున్నారని ఆటో, క్యాబ్ డ్రైవర్లు మొరపెట్టుకున్నారు. అలాగే జీహెచ్ఎంసీలో కాంట్రాక్టు ఉద్యోగులతో 11 గంటలపాటు పనిచేయించుకుంటూనే.. వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పి మోసం చేశారని వాపోయారు.
పని భారంతో సతమతమవుతున్నామని .. ఉద్యోగ భద్రత, ఇన్సూరెన్స్ కూడా లేవని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ సమస్య వచ్చినా కంపెనీ తమనే బాధ్యుల్ని చేస్తోందని గిగ్ వర్కర్స్ ఆరోపించారు. రోజంతా పని చేసినా రూ.1000 కూడా రావడం లేదని వాపోయారు. తమ సంక్షేమాన్ని ఎవరూ పట్టించుకోవడం లేదని ఘోస పెట్టుకున్నారు. తప్పు చేయకపోయినా కంపెనీ తమ ఐడీ బ్లాక్ చేస్తోందని రాహుల్ కు వివరించారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పారిశుద్ధ్య కార్మికులు సహా డెలివరీ బాయ్ లు, డ్రైవర్ల సమస్యలను పరిష్కరిస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ గెలవగానే కార్మికులతో సీఎం సమావేశమవుతారని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి అజారుద్దీన్ కూడా పాల్గొన్నారు.
.
.
.