Rahul Gandhi : దొరల తెలంగాణ.. ప్రజల తెలంగాణ మధ్య ఎన్నికలు జరగబోతున్నాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ములుగులో నిర్వహించిన కాంగ్రెస్ విజయభేరి సభలో రాహుల్.. కేసీఆర్ సర్కార్ పై విమర్శలు గుప్పించారు. 2004లో కాంగ్రెస్ తెలంగాణ ఇస్తామని హామీ ఇచ్చి నెరవేర్చిందన్నారు. సాధారణంగా నష్టం కలిగించే నిర్ణయాలు ఏ పార్టీ తీసుకోదన్నారు. కాంగ్రెస్ మాత్రం తనకు నష్టం కలుగుతుందని తెలిసినా తెలంగాణ ఇచ్చిందని స్పష్టం చేశారు.
కేసీఆర్ గతంలో ఎన్నో హామీలు ఇచ్చారని రాహుల్ గాంధీ గుర్తు చేశారు. దళితులకు 3 ఎకరాల భూమి ఇచ్చారా? ఇంటికో ఉద్యోగం ఇచ్చారా? డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించారా? రైతులకు లక్ష రూపాయలు రుణమాఫీ చేశారా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చామని చెప్పుకొచ్చారు. రాజస్థాన్లో అందరికీ ఉచిత వైద్యం ఇస్తున్నామన్నారు. రాజస్థాన్లో ఉచిత వైద్యం పథకం దేశంలోనే అద్భుతంగా ఉందన్నారు. ఛత్తీస్గఢ్లో ధాన్యం క్వింటాల్ రూ.2,500కే కొంటున్నామన్నారు. కర్ణాటకలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించామన్నారు. ఇచ్చిన మాటను కాంగ్రెస్ తప్పకుండా నిలబెట్టుకుంటుందని రాహుల్ స్పష్టం చేశారు.
తెలంగాణలో బీజేపీ అడ్రస్ గల్లంతైందని రాహుల్ గాంధీ అన్నారు. ఇక్కడ బీఆర్ఎస్ గెలవాలని బీజేపీ కోరుకుంటోందన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ కలిసి పనిచేస్తున్నాయని ఆరోపించారు. వాటితో ఎంఐఎం కూడా జత కట్టిందని విమర్శించారు. పార్లమెంట్లో బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్ని బిల్లులకు బీఆర్ఎస్ మద్దతు తెలిపిందన్నారు. కాంగ్రెస్ను ఓడించేందుకు బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం మిలాఖత్ అయ్యాయన్నారు. కేసీఆర్పై సీబీఐ, ఈడీ, ఐటీ కేసులు ఉండవని రాహుల్ అన్నారు. తనను కేంద్రం ఎన్నో రకాలుగా వేధించిందన్నారు. కానీ కేసీఆర్పై ఒక్క కేసు కూడా పెట్టదన్నారు. బీఆర్ఎస్ కు ఓటేస్తే బీజేపీకి వేసినట్టేనని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.