Rahul Gandhi: రాహుల్ గాంధీ. మాజీ ప్రధాని మనవడు, మాజీ ప్రధాని తనయుడు. రాజకీయాల్లో టాప్ సెలబ్రెటీ లీడర్. ఇన్నాళ్లూ ఢిల్లీకే పరిమితమైన రాహుల్.. భారత్ జోడో యాత్రతో యావత్ దేశానికి దగ్గరయ్యారు. ఈ యాత్ర ఆయనపై మరింత ఇంట్రెస్ట్ పెరిగేలా చేసింది. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకూ.. పాదయాత్ర చేసిన రాహుల్.. ఇన్నాళ్లూ యాత్రలో ఏం తిన్నారు? ఆయనకు ఏ ఫుడ్ అంటే ఇష్టం? ఏ రాష్ట్ర రుచులు ఎలా ఉన్నాయి? వెజ్, నాన్ వెజ్ లో ప్రయారిటీ దేనికి? ఇలా, ఆహారం గురించి రాహుల్ గాంధీతో ఆసక్తికర ఇంటర్వ్యూ చేసింది ‘కర్లీ టేల్స్’ అనే ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్. ఆ ఇంటర్వ్యూలో తెలంగాణ వంటలకాల గురించి ఆసక్తికర కామెంట్లు చేశారు రాహుల్ గాంధీ. ఇంతకీ ఆయన ఏమన్నారంటే…
ఇంట్లో ఉంటే డైట్ విషయంలో చాలా కచ్చితంగా ఉంటానన్నారు రాహుల్. కానీ, జోడో యాత్రలో భోజనం గురించి తాను పెద్దగా పట్టించుకోలేదన్నారు. ఏది అందుబాటులో ఉంటే అది తినేవాడినని చెప్పారు. యాత్రలో భాగంగా ఎన్నో రాష్ట్రాల వంటకాలు రుచిచూశానని.. సంప్రదాయాల్లాగే ఆహారంలో చాలా వ్యత్యాసాలున్నాయని రాహుల్ గాంధీ తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. తెలంగాణ వంటకాలు తనకు కాస్త ఘాటుగా అనిపించాయని చెప్పారు. అక్కడ కారం కాస్త ఎక్కువ.. నేను అంత కారం తినలేను.. అంటూ ఆనాటి ఘాటును గుర్తు చేసుకున్నారు రాహుల్ గాంధీ.
అదీ మేటర్. తెలంగాణ ప్రజల్లానే.. ఇక్కడి వంటకాలు కూడా స్పైసీగా ఉంటాయిని అందరికీ తెలిసిందే. ఆ ఘాటు వల్లే మన వంటలకు మరింత రుచి. హైదరాబాదీ బిర్యానీ కూడా స్పైసీనెస్ వల్లే అంత ఫేమస్ అయింది. కానీ, ఉత్తరాది వారు అంతగా మసాలాలు వాడరు. అందుకే, తెలంగాణ ఫుడ్ రాహుల్ గాంధీకి చాలా స్పైసీగా అనిపించిందని అంటున్నారు. మన ఫుడ్ తిని ఇన్నిరోజులవుతున్నా.. ఆయనకింకా ఇక్కడి ఘాటు గుర్తుందంటే.. మన మసాలాలు రాహుల్ నశాలానికి ఎక్కే ఉంటాయి. ఇక, తెలంగాణ యాత్రలో ఓచోట రాహుల్ గాంధీ ‘బొంగులో చికెన్’ వండిన విషయం తెలిసిందే.
రాహుల్ గాంధీ నాన్ వెజిటేరియన్. అన్ని రకాల కూరగాయలు, పప్పులు తింటారు కానీ.. బఠాణీ అంటే, పనసపండు అంటే.. అస్సలు ఇష్టం ఉండదట. పనసపండు వాసనే నచ్చదట. ఈ విషయం ఆ ఇంటర్వ్యూలో రాహులే చెప్పారు. ఇక, మాంసాహారాన్ని ఇష్టంగా తింటారు. చికెన్, మటన్, సీఫుడ్ అన్నీ తినేస్తారు. అందులోనూ.. చికెన్ టిక్కా, సీఖ్ కబాబ్, ఆమ్లెట్లు రాహుల్ ఫేవరెట్. ఇక, ‘కాఫీ’తోనే తన రోజు మొదలవుతుందని.. ప్రతీ ఉదయం కాఫీ నోట్లో పడాల్సిందేనని చెప్పారు రాహుల్ గాంధీ.