Raghunandanrao : ఐపీఎస్ అధికారులకు పోస్టింగ్ కేటాయింపుల విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం వైఖరిని బీజేపీ తప్పుపడుతోంది. ఏపీ కేడర్కు చెందిన డీజీపీ అంజనీ కుమార్ను వెంటనే ఆ రాష్ట్రానికి పంపాలని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు డిమాండ్ చేశారు. ఐపీఎస్ల పోస్టింగుల్లో తెలంగాణ అధికారులకు అన్యాయం జరిగిందన్నారు. కీలక పోస్టుల్లో ఒక్క తెలంగాణ అధికారిని కూడా ప్రభుత్వం నియమించలేదని మండిపడ్డారు.
తెలంగాణ ఐపీఎస్లకు న్యాయం చేయాలని రఘునందన్ రావు డిమాండ్ చేశారు. ఇటీవల జరిగిన 93 మంది ఐపీఎస్ల బదిలీల్లో రాష్ట్రానికి చెందినవారికి అన్యాయమే జరిగిందన్నారు. నాలుగు కీలక పోస్టులను బిహార్ కు చెందిన అంజనీకుమార్, సంజయ్కుమార్ జైన్, షానవాజ్ ఖాసిం, స్వాతి లక్రాకు ఇచ్చారని మండిపడ్డారు.
రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి కేటాయించిన అధికారులు చాలామంది ఇప్పటికే తెలంగాణలో కొనసాగుతున్నారు. అయితే ఇటీవల హైకోర్టు తీర్పుతో సీఎస్ పదవి నుంచి సోమేష్ కుమార్ తప్పుకోవాల్సి వచ్చింది. ఆయనను రాష్ట్ర విభజన సమయంలో కేంద్రం ఏపీకి కేటాయించింది. క్యాట్ ఉత్తర్వులతో మొన్నటి వరకు తెలంగాణలో కొనసాగారు. హైకోర్టు తీర్పురాగానే …కేంద్రం ఏపీకి వెళ్లాల్సిందేనని ఆదేశించడంతో ఆ రాష్ట్రానికి వెళ్లి రిపోర్ట్ చేశారు. ప్రస్తుతం డీజీపీగా ఉన్న అంజనీ కుమార్ ను కూడా రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి కేటాయించారు. ఆయన కూడా క్యాట్ ఉత్తర్వులతో తెలంగాణలో కొనసాగుతున్నారు. అంజనీకుమార్ ను తెలంగాణలో కొనసాగించడంపై హైకోర్టు తీర్పు త్వరలోనే రానుంది. ఈ తీర్పుపై ఉత్కంఠ నెలకొంది.