Raghunandanrao : ఐటీ దాడుల విషయంలో కేంద్రంపై మంత్రి మల్లారెడ్డి చేసిన విమర్శలను బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఖండించారు. మల్లారెడ్డి తన ఫోన్ను చెత్తబుట్టలో ఎందుకు దాచిపెట్టారని ప్రశ్నించారు. ఫోన్లు దాచిపెట్టుకున్నారంటేనే ఏదో జరిగిందని అర్థమవుతోందని అనుమానం వ్యక్తం చేశారు. మల్లారెడ్డి తప్పు చేయనప్పుడు విచారణకు ఎందుకు భయపడుతున్నారని రఘునందన్ ప్రశ్నించారు.ఐటీ అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తే సరిపోతుందని అన్నారు.చట్టం ముందు అందరూ సమానమేనని అన్నారు. అధికారం అడ్డుపెట్టుకుని తప్పు చేసిన వారే భయపడతారని విమర్శించారు.
ఐటీ దాడులకు రాజకీయ కోణాన్ని ఆపాదించడం సరికాదని రఘునందన్ రావు అన్నారు. కక్ష సాధింపు కోసమే ఐటీ దాడులు చేస్తున్నారని మల్లారెడ్డి చెప్పడం సరికాదన్నారు.సాక్ష్యాల ఆధారంగానే అధికారులు విచారణ జరుపుతారని తెలిపారు. కొడుకును కొట్టారంటూ మల్లారెడ్డి ఆరోపణలు చేయడం సరికాదని హితవు పలికారు. ఏ అధికారి చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని ఎవరినీ కొట్టరని స్పష్టం చేశారు. మంత్రి మల్లారెడ్డి వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యంగా ఉన్నాయని రఘునందన్ విమర్శించారు. ఐటీ అధికారులకు వచ్చిన ఫిర్యాదు ప్రకారమే దాడులు నిర్వహిస్తున్నారని చెప్పారు. మల్లారెడ్డి సంస్థల్లో పని చేసే వారే ఐటీకి సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోందని తెలిపారు.
ఎవరికి నోటీసులు ఇచ్చినా గుండె నొప్పి అంటూ ప్రతి ఒక్కరూ ఆసుపత్రికి వెళుతున్నారని రఘునందన్ రావు మండిపడ్డారు. నోటీసులు ఇవ్వగానే గుండె నొప్పి వస్తుందా అని ప్రశ్నించారు.