Raghunandan : తెలంగాణలో బీజేపీ-బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇరుపార్టీల నేతలు సవాల్ ప్రతిసవాళ్లు చేసుకుంటున్నారు. ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి చేసిన ఆరోపణలను బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఖండించారు. పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని విమర్శించారు. అయ్యప్ప మాలలో ఉండి అలా మాట్లాడటం సరికాదని సూచించారు. డ్రగ్స్ తీసుకోలేదని రోహిత్ రెడ్డి ఎందుకు ప్రమాణం చేయలేదని రఘునందన్ రావు ప్రశ్నించారు.
రోహిత్ కాంగ్రెస్లో ఉన్నప్పుడు కేసీఆర్ను దొర అని తిట్టారని రఘునందన్ గుర్తు చేశారు.
కానీ ఇప్పుడు అదే దొర వద్ద పనిచేస్తున్నారని చురకలు అంటించారు. తాను డబ్బులు వసూలు చేశానన్న ఆరోపణలపై ఘాటుగా స్పందించారు. డబ్బులు వసూలు చేస్తే నిరూపించాలని రఘునందన్ సవాల్ విసిరారు.
జర్నలిస్టు ఉద్యోగం నుంచి జీవితాన్ని ప్రారంభించిన రఘునందన్రావు రూ. 10 కోట్ల విల్లాలో ఎలా నివసిస్తున్నారో చెప్పాలని తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ప్రశ్నించారు. రూ.100ల కోట్లు ఎలా సంపాదించారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ డబ్బంతా పఠాన్చెరు పరిశ్రమల నుంచి వసూలు చేసిన సొమ్ము అని ఆరోపించారు. ఈ నేపథ్యంలో రఘునందనరావు స్పందించారు. తాను డ్రగ్స్ తీసుకోవడం లేదని రోహిత్ రెడ్డి ఎందుకు ప్రమాణం చేయలేదని ఎదురు ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమంలో రోహిత్ రెడ్డి పాల్గొనలేదని అన్నారు. తాము తెలంగాణ కోసం పోరాటం చేశామన్నారు. తన ఆస్తుల వివరాలు వెల్లడించాడనికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. కేసీఆర్ కుటుంబ ఆస్తుల వివరాలు బహిర్గతం చేయడానికి సిద్ధమేనా అని రఘునందన్ సవాల్ చేశారు.