Rachakonda Farmer Yadaiah(Local news telangana): రాచకొండ ప్రాంతం తుంబావి తండాకు చెందిన నల్లబోతు యాదయ్యకు 273 సర్వే నంబర్ లో కొంత అసైన్డ్ భూమి ఉంది. ఈ భూమిలో రైతు యాదయ్య రక్తంతో స్వేదాన్ని చిందించి.. పంటపొలంగా చేసి వరి పంటను సాగు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. సాఫీగా సాగుతున్న అతని జీవితంలో ధరణి పెనుమంటల పెనుగులాటయ్యింది. ధరణి వ్యవస్థలో అతని భూమి నిషేధిత జాబితాలోకి చేరింది. ఫారెస్టు అధికారులు యాదయ్యను ఆ భూమి నుంచి వెళ్లిపోవాలని వేధింపులకు గురిచేస్తున్నారు. కేసులు పెట్టి అతని జీవితాన్ని ఆగమాగం చేస్తున్నారు. కేసులతో చితిపోతున్న జీవనాధారమైన భూమిని వదులుకోలేక కష్టాలను కన్నీళను అధిగమిస్తూనే అ రైతు ముందుకు సాగుతున్నాడు.
ప్రస్తుతం దిన దినం భూగర్భ జలాలు అడుగంటి బోరు బావి వట్టిపోయింది. ప్రెస్సింగ్ చేద్దామంటే ఫారెస్ట్ అధికారులు బోరు బండి యజమానులకు నోటీసులు ఇస్తున్నారు. దీంతో ఎవ్వరు ముందుకు రాని పరిస్థితి. దాదాపు లక్షరుపాయల పెట్టుబడితో సాగు చేసిన వరి పంట ప్రస్తుతం పిలిక దశలో, కరకు దశలో ఉంది. పొలానికి నీరందక వారం గడుస్తోంది. వేసవి ఎండలు ఎక్కువ అవుతున్నందున పొలమంతా నెర్రలు చాచి నీళ్ళకోసం నోరేళ్లబెట్టింది. రైతు బాధను ఎవ్వరికి చెప్పుకోవాలో తెలియక ఎండుతున్న పొలాన్ని చూసి.. బరువెక్కిన గుండెతో అ రైతు తల్లడిళ్లుతున్నాడు.
పాపం వరి చేనుకు ఏమి తెలుసు.. అందరి ఆకల్ని తీర్చడం తప్ప. ఫారెస్ట్ చట్టాలు, రేంజర్, బీట్ అధికారుల కుట్రలకు బలై పోతామని. నారు పోసినవాడు నీరు పోయక పోతాడా అని కోటి ఆశలతో ఎదురుచూస్తూ ఉంది ఆ వరి పైరు. ప్రభుత్వ భూమిని ఫారెస్ట్ భూములంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని.. ఫారెస్ట్ అధికారులపై చర్యలు తీసుకోవాలని పాలకులను రైతు యాదయ్య వేడుకుంటున్నాడు. ఇటీవల హైదరాబాద్లో రోడ్డు పక్కన ఫుడ్ బిజెనెస్ చేసుకుంటున్న కుమారి ఆంటీకి కష్టం వస్తే.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమెకు సహాయం చేశారు. మరి ఇప్పుడు కష్టంలో ఉన్న రైతు యాదయ్యను కూడా అలాగే ఆదుకొని ప్రజల సిఎం అనిపించుకుంటారా?..