Congress : ఖమ్మంలో కాంగ్రెస్ జనగర్జన సభకు సర్వం సిద్ధమైంది. ఆదివారం సాయంత్రం భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఈ సభకు హాజరవుతారు. సభా వేదికపై మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకుంటారు. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పీపుల్స్మార్చ్ పాదయాత్ర ముగింపు సందర్భంగా ఈ సభను ఏర్పాటు చేశారు.
ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లోని 10 నియోజకవర్గాలతోపాటు నల్గొండ, సూర్యాపేట, వరంగల్, మహబూబాబాద్, ములుగు జిల్లాల నుంచి కార్యకర్తలు భారీ తరలి వచ్చేలా నాయకులు ఏర్పాట్లు చేశారు. 40 ఎకరాల్లోని బహిరంగ సభాస్థలిలో వేదికను ఏర్పాటు చేశారు. 50 అడుగుల ఎల్ఈడీ తెరను వేదిక వెనుక వైపు, వేదికకు రెండువైపులా భారీ ఎల్ఈడీ తెరలు ఏర్పాటు చేశారు. సభా ప్రాంగణం చుట్టూ 15 ఎల్ఈడీ తెరలు ఏర్పాటు చేస్తున్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, రేవంత్రెడ్డి, భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డిల భారీ కటౌట్లు ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి.
వేదికపై 200 మంది కుర్చునేలా ఏర్పాట్లు చేశారు. సభా ప్రాంగణం చుట్టూ కీలక నేతల హోర్డింగులు, ఫ్లెక్సీలు ఆకట్టుకుంటున్నాయి. 60 ఎకరాల్లో వాహనాలకు పార్కింగ్ సదుపాయం కల్పించారు. అశ్వారావుపేట, భద్రాచలం, కొత్తగూడెం, సత్తుపల్లి, వైరా నియోజకవర్గాల నుంచి వచ్చే వాహనాలకు జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న ప్రాంతాన్ని పార్కింగ్ కు కేటాయించారు. ములుగు, డోర్నకల్, మహబూబాబాద్,ఇల్లెందు, పాలేరు, పినపాక నియోజకవర్గాల నుంచి వచ్చే వాహనాల పార్కింగ్ కోసం రఘునాథపాలెం-ఎస్ఆర్ గార్డెన్స్ మధ్య రహదారి వెంట ఖాళీ స్థలాలను సిద్ధం చేశారు.
రాహుల్ గాంధీ ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో ఆదివారం సాయంత్రం 4.40 గంటలకు గన్నవరం విమానాశ్రయంలో దిగుతారు. అక్కడి నుంచి హెలీకాప్టర్లో ఖమ్మం వస్తారు. పీపుల్స్మార్చ్ పాదయాత్ర పూర్తి చేసిన భట్టి విక్రమార్కను సన్మానిస్తారు. పొంగులేటికి కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తారు. మరికొందరు ముఖ్యనేతలు కాంగ్రెస్ లో చేరనున్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం నుంచి రఘునాథ్యాదవ్, మహేశ్వరం- కొత్త మనోహర్రెడ్డి, పాలకుర్తి- హనుమాండ్ల ఝాన్సీరెడ్డి, సూర్యాపేట-పెద్దిరెడ్డి రాజా కాంగ్రెస్ కండువాలు కప్పుకుంటారు.
భద్రాద్రి జడ్పీ ఛైర్మన్ కోరం కనకయ్య, పలువురు జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులు బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పారు. వారంతా కాంగ్రెస్ లో చేరతారు. సభ ముగిశాక రాహుల్ రాత్రి 8.30 గంటలకు రోడ్డు మార్గంలో గన్నవరం విమానాశ్రయానికి వెళ్లి అక్కడ నుంచి ఢిల్లీ వెళతారు.