తెలంగాణలో మునుపెన్నడూ చూడని ప్రకృతి విలయం. పీఠభూమి ప్రాంతంలో జల ప్రళయం. పక్కన సముద్రం ఏమీ లేదు. సునామీ ఏమీ మీదపడ లేదు. తుపానులు కూడా రాలేదు. నదులేమీ ముంచెత్త లేదు. అయినా, జలఖడ్గం దాడి చేసింది. వాన చినుకులే ఉప్పెనలా విరుచుకుపడ్డాయి. ఆకాశానికి చిల్లుపడింది. మేఘం గర్జించింది. భీకర వర్షం కురిసింది. వాన వరదై పొంగింది. వాగులు, వంకలు, నగరాలు, ఊర్లు ఏకమయ్యాయి. అంతా జలార్పణం. సర్వం నాశనం. ఇది పక్కా ప్రకృతి విపత్తే. అనుకోని ప్రళయమే. ఇందులో డౌట్ ఏమీ లేదు. కానీ…..
సర్కారు తప్పేమీ లేదా? ఇదంతా పాలకుల చేతగానితనం కాదా? అధికారుల నిర్లక్ష్యం నిలువుటద్దంగా కనిపించడం లేదా? అవును, ఇంతటి విపత్తుకు ప్రభుత్వ ఉదాసీనతే కారణమనే విమర్శలు వినిపిస్తున్నాయి. వరదలతో ఊళ్లకు ఊళ్లు జలదిగ్బంధనంలో చిక్కుకోవడానికి.. పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోవడానికి.. పలువురు గల్లంతు అవడానికి.. వందల కోట్ల ఆస్థి నష్టం జరగడానికి.. నగరాలు నిండా మునగడానికి.. గ్రామాలు, పొలాలు చెరువులా మారడానికి.. జనాలు రోజుల తరబడి వరదలో చిక్కుకుపోవడానికి.. ఇలా అన్నిటికీ కారణం సర్కారు వైఫల్యమే అంటున్నారు.
పది రోజులుగా రోజూ వాన కురుస్తోంది. వాతావరణ శాఖ ప్రతీరోజూ రెయిన్ అలర్ట్ ఇస్తోంది. మొదట్లో హైదరాబాద్ను వాన వణికించింది. ఆ తర్వాత జిల్లాలపై కుండపోత కురిపించింది. మెయిన్గా.. వరంగల్పై గట్టిగా పగ పట్టింది. ఇదంతా సడెన్గా కురిసిన వాన కాదు. వెదర్ రిపోర్ట్ ముందే హెచ్చరించింది. నాన్స్టాప్ న్యూస్తో మీడియా ప్రజలను అప్రమత్తం చేసింది. మరి, సర్కారు ఏం చేసింది? అతిభారీ వర్షాలు పడతాయని తెలిసినా.. ముందస్తు సన్నద్దత ఎక్కడుంది? ఏ జిల్లా కలెక్టర్లను అలర్ట్ చేశారు? ఏ సీనియర్ అధికారులను ముందుగా జిల్లాలకు తరలించారు? పోలీస్, మున్సిపల్, ఫైర్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందిని ఏమేరకు సంసిద్ధులను చేశారు? ఇందులో ఏ ఒక్కటీ చేయలేదు ప్రభుత్వం. ఎప్పటిలానే రాజకీయాల్లో బిజీగా ఉన్నారు సీఎం కేసీఆర్. యాదాద్రి జిల్లా డీసీసీ ఛైర్మన్ అనిల్రెడ్డికి పార్టీ కండువా కప్పడానికి మాత్రం తీరిక దొరికింది దొర గారికి అంటున్నారు.
బుధవారం రాత్రి చరిత్రలో చూడనంత రికార్డు స్థాయి వర్షం కురిసింది. ఉమ్మడి వరంగల్ జిల్లా ఆగమాగం అయింది. మోరంచపల్లిలో జలప్రళయమే సంభవించింది. ఊరుఊరంతా నీట మునిగింది. కొందరు గల్లంతయ్యారు. వందలాది మంది.. గంటల తరబడి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమన్నారు. ఉదయానికల్లా మీడియా మొత్తం బ్రేకింగ్ న్యూస్లతో హోరెత్తడంతో తీరిగ్గా తేరుకున్నారు సీఎం సాబ్. అప్పటికి కానీ వానలపై సమీక్ష స్టార్ట్ చేయలేదు ముఖ్యమంత్రివర్యులు. సీఎస్ను పిలిచి.. మోరంచపల్లికు ఆర్మీ హెలికాప్టర్లు పంపించారు. వర్ష ప్రభావం ఎక్కువగా ఉన్న నాలుగు జిల్లాలకు ప్రత్యేకంగా ఐఏఎస్లను నియమించారు. SDRF బృందాలను రంగంలోకి దింపారు. ఇదంతా చేయాల్సింది ఎప్పుడు? చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం ప్రయోజనం? అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయిందిగా? భారీ వర్షాలు పడతాయని తెలిసినా.. వరంగల్ జిల్లాలో ఒక్క లోతట్టు ప్రాంతాన్నయినా ముందస్తుగా ఖాళీ చేయించారా? ఒక్క వ్యక్తినయినా సహాయక కేంద్రానికి తరలించారా? అసలు అలాంటి కేంద్రాలు ఏమైనా ఏర్పాటు చేశారా?
గత మూడేళ్లలో వరంగల్ సిటీ రెండుసార్లు నిండా మునిగింది. ఆ జలఘాతం నుంచి ఎలాంటి గుణపాఠం నేర్వలేదు ఈ సర్కారు. ఫలితం.. మళ్లీ వాన పడింది. ఈసారి కూడా ట్రైసిటీ ఆగమాగం అయింది. వరంగల్, హన్మకొండ, కాజీపేట్ పట్టణాలు పూర్తిగా జలమయమయ్యాయి. లక్షలాది మంది నగరవాసులు వరద పాలయ్యారు. నాలాల వెడల్పు, మాస్టర్ ప్లాన్ ముచ్చట ఏమైందని ప్రశ్నిస్తున్నారు వరంగల్వాసులు.
ఇదేనా పాలనంటే? ఇదేనా బంగారు తెలంగాణ అంటే? కడెం ప్రాజెక్టు గేట్లు గతేడాది మొరాయించాయి.. ఈసారి కూడా అలానే సతాయించాయి. ఏడాది గడిచినా మరమ్మత్తులు చేయించాలనే సోయి కూడా లేదా కేసీఆర్ సర్కారుకు? అని నిగ్గదీసి అడుగుతోంది తెలంగాణ ప్రజానికం.
లాస్ట్ ఇయర్ గోదావరికి భారీ వరద వచ్చి భద్రాచలం నిండా మునిగింది. అప్పట్లో సీఎం కేసీఆర్ హెలికాప్టర్లో టూర్ వేసి.. పరిస్థితిని సమీక్షించి.. 10వేలు సాయం ప్రకటించారు. ఇప్పటికీ ఆ హామీ.. ప్రకటనగానే మిగిలింది. సాయం కోసం ఏడాదిగా ఎదురుచూస్తున్నారు. 10వేలు అయితే రాలేదు కానీ.. మళ్లీ వరద ముంచెత్తింది. భద్రాచలం దగ్గర మూడవ ప్రమాద హెచ్చరిక కూడా జారీ కావడంతో.. గత చేదు అనుభవాలను గుర్తు చేసుకుంటున్నారు బాధితులు.
అందుకే, నగరాలను డల్లాస్ చేయడం కాదు ఖల్లాస్ చేస్తున్నారంటూ ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. #TGCMMISSING, #WhereisKCR? అంటూ హ్యాష్ ట్యాగ్లు ట్రెండ్ అవుతున్నాయి.
ఊర్లు మునిగినా, ఇండ్లు కూలినా, జనం వరదల్లో పడి కొట్టుకుపోతున్నా.. దొర గడీ దాటి బయటకు రారని, జనాన్ని ఆదుకోరని విమర్శలు వస్తున్నాయి. వానలు వెలిశాక.. చుట్టం చూపుగా హెలికాప్టర్లో చక్కర్లు కొడతారని.. ఇంటికి పది వేలు, పంటకు పది వేలు అంటూ ప్రకటనలు ఇస్తారని.. పిట్టల దొర పాలనంటే ఇదేనంటూ ప్రతిపక్షాలు, నెటిజన్లు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. షేమ్ ఆన్ కేసీఆర్ సర్కార్ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మరి, ఈ సెగ సీఎంకు తాకుతోందా?