Psycho Killer : నిజామాబాద్ జిల్లాలో వరుస హత్యలు కలకలం రేపాయి. ఓ సైకో కిల్లర్ 15 రోజుల వ్యవధిలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురిని హత్య చేశాడు. నర హంతకుడైన అతను.. ఆరుగురిని హత్య చేసి వారి మృతదేహాలను వివిధ ప్రాంతాల్లో పారేసాడు. సదా శివనగర్ లో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యం కావడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
బాల్కొండ సోన్ బ్రిడ్జి సమీపంలో ఇద్దరు పిల్లల మృతదేహాలు లభ్యం అయ్యాయి. మాచా రెడ్డిలో మరొక మృత దేహం లభ్యం అయ్యింది. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో ఎక్కడా మిస్సింగ్ కేసులు నమోదు కాలేదు. పోలీసులు ఈ హత్యలపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంటి కోసం వరుస హత్యలు చేసినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిందితుడు మాక్లుర్ కు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. కాగా.. ఒకే కుటుంబానికి చెందిన వారు వరుసగా హత్యకు గురవ్వడంతో గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు.