Group 1 aspirants protesting again: హైదరాబాద్లోని అశోక్ నగర్లో గ్రూప్ - 1 విద్యార్థులు మరోసారి నిరసన వ్యక్తం చేపట్టారు. దీంతో పోలీసులు భారీగా మోహరించారు. అశోక్ నగర్ ప్రాంతమంతా కర్ఫ్యూ వాతావరణాన్ని తలపిస్తోంది. ఎక్కడా 10 మంది కనిపించినా పోలీసులు చెదరగొడుతున్నారు. బడుగు బలహీన వర్గాలు, పేదల గొంతు కోస్తోందని ఆరోపించారు. మానసికంగా ఒత్తిడికి గురవుతున్నామని ఆందోళన చేశారు.
కొంతమంది అభ్యర్థులు ప్రెస్ మీట్లో మాట్లాడేందుకు ప్రయత్నిస్తుండగా.. పోలీసులు వారిని అడ్డుకొని అరెస్ట్ చేసి తీసుకెళ్లినట్లు అక్కడ ఉన్న అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. పోలీసులు, ప్రభుత్వ తీరుపై అభ్యర్థులు మండిపడుతున్నారు. అభ్యర్థులను కొట్టవద్దని సీఎం చెప్పినా పోలీసులు ఇంకా లాఠీఛార్జ్ చేస్తున్నారని వాపోయారు.
జీఓ 29తో రిజర్వేషన్ పొందేవారు ఓపెన్ కేటగిరీలో ఉద్యోగం పొందే అర్హత లేదని అభ్యర్థులు పేర్కొన్నారు. హాల్ టికెట్స్ డౌన్ లోడ్ చేసుకున్నంత మాత్రాన తాము పరీక్ష రాసేందుకు సిద్ధంగా ఉన్నట్లు కాదని వివరించారు. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి గ్రూప్ -1 అభ్యర్థులను పిలిపించుకొని మా బాధ వినాలని కోరారు.
ప్రతిపక్షాల నాయకులతో మాట్లాడే బదులు మాతో మాట్లాడలని స్పష్టం చేశారు. మేము ఆర్థికంగా, మానసికంగా చితికిపోయినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. మా బాధ ఏంటో తెలుసుకోవాలని, రాజకీయాలకు మేము అతీతమని వెల్లడించారు. మాకున్న చివరి అవకాశం చేజార్చవద్దని, ఇదేనా ప్రజాపాలన, దయచేసి ఒక్కసారి ఆలోచించాలంటూ పలువురు అభ్యర్థులు కోరారు.
ఇదిలా ఉండగా, గ్రూప్-1 పరీక్ష రద్దు విషయంపై మంత్రి సీతక్క మాట్లాడారు. ఎవరేం చేసినా గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష ఆగదని మంత్రి స్పష్టం చేశారు. అభ్యర్థులు ప్రతిపక్షాల నాయకుల ట్రాప్లో పడవద్దని సూచించారు. గత ప్రభుత్వంలో పేపర్ లీకులు జరిగాయని ఆమె ఆరోపించారు. గత పదేళ్లుగా డీఎస్పీ, గ్రూప్ 1 పరీక్షలు జరగలేదని, కనీసం నిర్వహించాలనే ఆలోచన కూడా అప్పటి ప్రభుత్వానికి రాలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చిందన్నారు. ఇప్పుడేమో గ్రూప్ 1 పరీక్ష నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తే.. ప్రజలను, విద్యార్థులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి దుయ్యబెట్టారు.