Priyanka: గ్యాప్ లేకుండా దంచికొడుతున్న వర్షాలు.. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలను ముంచేయగా.. ఇప్పుడు కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకగాంధీ తెలంగాణ పర్యటనపై కూడా ఎఫెక్ట్ చూపాయి. ఈ నెల 30న కొల్లాపూర్లో జరగాల్సిన ‘ప్రజా భేరి’ సభను వాయిదా వేస్తునట్టు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.
ఈ సభలోనే కాంగ్రెస్ పార్టీలో జూపల్లి కృష్ణారావు చేరాల్సి ఉంది. ఇప్పటికే కొల్లాపూర్లో భారీ బహిరంగసభ కోసం ఏర్పాట్లు చేసుకుంటున్నారు. 30న ప్రియాంకా గాంధీ వచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే వర్షాల కారణంగా సభను వాయిదా వేయక తప్పలేదు. వచ్చే నెల 5 లేదా 6వ తేదీన సభను నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.
ప్రియాంకా గాంధీ కొల్లాపూర్ సభ వాయిదా పడటం ఇది రెండోసారి. గతంలో జులై 20న సభను నిర్వహించాలని అనుకున్నారు. కానీ ప్రియాంకా గాంధీ బిజీగా ఉండటంతో వాయిదా పడింది. ఈ సారి ప్రియాంకా గాంధీ సమయం ఇచ్చినా వర్షాల కారణంగా వాయిదా వేయక తప్పలేదు.
కొల్లాపూర్ సభలోనే జూపల్లి కృష్ణారావు ఉమ్మడి మహబాబ్నగర్ జిల్లా వ్యాప్తంగా తన అనుచరుల్ని పార్టీలో చేర్చేందుకు రెడీ అవుతున్నారు. కొల్లాపూర్ సభలో పెద్ద ఎత్తున చేరికలకు కాంగ్రెస్ నేతలు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్రెడ్డి, ఆయన తనయుడు రాజేష్రెడ్డితో పాటు అనేక మంది నేతలు కాంగ్రెస్ తీర్థం తీసుకోనున్నారు.
పాలమూరు ప్రజా భేరి పేరుతో సభ నిర్వహించి మూడు లక్షల మంది జన సమీకరణ చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు కాంగ్రెస్ నేతలు. ఆగస్టు 14న సీఎం కేసీఆర్ నాగర్ కర్నూల్ జిల్లా పరిధిలో సభ నిర్వహిస్తున్నారు. ఆ సభకు టార్గెట్ నిర్దేశించేలా భారీగా జన సమీకరణ చేయాలనుకుంటున్నారు. యావత్ తెలంగాణ రాష్ట్రానికి వినపడేటట్టుగా, కనపడేటట్టుగా పాలమూరు ప్రజాభేరీ సభను నిర్వహించాలని అటు జూపల్లి కృష్ణారావు.. ఇటు హస్తం నేతలు ప్లాన్ చేస్తున్నారు. అయితే వారం రోజులు మాత్రమే సభ వాయిదా పడిందని.. సభను అనుకున్న విధంగా విజయవంతం చేస్తామని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఇక, ప్రజా భేరి సభలోనే మహిళల అభ్యున్నతి కోసం.. మహిళా డిక్లరేషన్ ప్రకటిస్తారు ప్రియాంక గాంధీ.