బీఆర్ఎస్, బీజేపీలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ. జహీరాబాద్ లో నిర్వహించిన బహిరంగ సభలో ఆమె ప్రసంగిస్తూ.. 10 ఏళ్ల పాలనలో ప్రజలకు చేసిందేమీ లేదని విమర్శలు గుప్పించారు. కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో కేసీఆర్ ప్రజలను దోచుకుని ధనవంతులయ్యారని మండిపడ్డారు. ఇలాంటి అవినీతి పాలనను అంతమొందించి జనం కోసం పాటుపడే తమ పార్టీని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
కాంగ్రెస్ పార్టీ అంటేనే సేవ చేయడం అని ప్రియాంక గాంధీ తెలిపారు. బీఆర్ఎస్ పాలనలో అవినీతి పెరిగిపోయిందని, ప్రాజెక్టుల పేరుతో లక్ష కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. పదేళ్లుగా రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్.. ప్రజల సొమ్మును అక్రమంగా దోచుకుందన్నారు. ధరల పెరుగుదలతో..సామాన్యులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. మహిళల కోసం బీఆర్ఎస్ ఏమైనా చేసిందా? ఒక్కసారి ఆలోచించాలని కోరారు. ఎందరో ఆత్మబలిదానాలతో సాధించుకున్న తెలంగాణలో.. ధరణి పోర్టల్ తో రైతులకు కష్టాలు పెరిగాయని, రుణమాఫీ హామీని నెరవేర్చలేదని బీఆర్ఎస్ పై విమర్శలు గుప్పించారు. ప్రజల తెలంగాణ, ప్రజల పాలన రావాలంటే.. కాంగ్రెస్ ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.