Congress : ఎమ్మెల్యే అభ్యర్థుల తొలి లిస్ట్ ప్రకటించడమే కాకుండా కాంగ్రెస్ ప్రచారంలోనూ దూసుకుపోతోంది. మలుగు బహిరంగ సభలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పాల్గొన్నారు. కాంగ్రెస్ హామీలను ప్రకటించారు. రాహుల్ గాంధీ ఆ తర్వాత కూడా ప్రచారంలో పాల్గొన్నారు. ఇప్పుడు ప్రియాంక గాంధీ మరోసారి తెలంగాణకు రాబోతున్నారు. ఈనెల 30న నల్గొండలో ప్రియాంక రోడ్షో ఉంటుందని చెప్పారు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి. అలాగే కొల్లాపూర్ లోనూ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు ప్రియాంక గాంధీ.
మరోవైపు అభ్యర్థుల రెండో జాబితాపై కసరత్తు జరుగుతోంది. స్క్రీనింగ్ కమిటీ కసరత్తు తుదిదశకు చేరిందని తెలుస్తోంది. వరుసగా రెండో రోజు ఢిల్లీలో స్క్రీనింగ్ కమిటీ సమావేశం జరిగింది. అభ్యర్థుల ఎంపికపై సుధీర్ఘంగా చర్చ జరిగింది. తొలి జాబితాలో 55 మంది అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించింది. మిగతా 64 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఇప్పటికే 35 నుంచి 40 మంది అభ్యర్థుల విషయంలో ఏకాభిప్రాయం కుదిరిందని సమాచారం. అక్టోబర్ 25న కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరుగుతుంది. అదే రోజు కాంగ్రెస్ రెండో జాబితా విడుదలయ్యే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.
వామపక్షాలతో కాంగ్రెస్ పొత్తు కుదిరినా.. సీట్ల సర్దుబాటుపై పీటముడి వీడలేదని సమాచారం. సీట్ల సర్దుబాటుపై స్క్రీనింగ్ కమిటీ చర్చించినా ఏకాభిప్రాయం కుదరలేదని తెలుస్తోంది. సీపీఐకి కొత్తగూడెం, చెన్నూరు, సీపీఎంకు మిర్యాలగూడ, వైరా సీట్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ ప్రతిపాదన చేసిందంటున్నారు. వైరాకి బదులు పాలేరు సీటు కోసం సీపీఎం పట్టుబడుతోందని సమాచారం. పాలేరు ఇవ్వడానికి కాంగ్రెస్ సిద్ధంగా లేదని వార్తలు వస్తున్నాయి. వైరా సీటుతో సరిపెట్టుకోవాలని సీపీఎం నేతలను ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. సీట్ల సర్దుబాటుపై మరొకసారి రాష్ట్ర నాయకత్వం వామపక్షాలతో చర్చించే అవకాశం ఉందంటున్నారు.
ఇంకోవైపు కాంగ్రెస్లో చేరికల జోరు కొనసాగుతోంది. కాంగ్రెస్ కండువా కప్పుకున్న వారిలో కొందరికి టికెట్లు దక్కుతాయన్న ప్రచారం జరుగుతోంది. టికెట్ ఆశావాహులంతా ఇప్పటికే ఢిల్లీకి చేరుకొని ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. మరోవైపు రెండో లిస్ట్లో అన్ని వర్గాలకు సముచిత ప్రాధాన్యం, ప్రాతినిధ్యం దక్కుతుందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.