Priyanka Gandhi : తెలంగాణ ఎన్నికల ప్రచారంలో ప్రియాంక గాంధీ.. ఇందిరమ్మను తలపిస్తున్నారు. ఆమె పాల్గొంటున్న సభలకు జనం వెల్లువలా తరలివస్తున్నారు. ప్రసంగాలు శ్రద్ధగా వినడమే కాకుండా చెయ్యెత్తి జై కొడుతున్నారు. ఎప్పుడో ఇందిరా గాంధీని చూడాలనుకున్నామని అయితే ఆ లోటు ఇప్పుడు ప్రియాంక రూపంలో తీరిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. లక్షలాదిగా సభలకు వస్తున్న ఓటర్లు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తామని.. ఇందిరమ్మ రాజ్యం రావాలని ఆకాంక్షిస్తున్నారు.
హుస్నాబాద్ గాంధీనగర్కు చెందిన రమాదేవి పట్టరాని సంతోషం ఇది. ఇందిరమ్మను చూడాలని కోరిక ఉండగా ఆమె మనవరాలు ప్రియాంక గాంధీ నేరుగా ఇంటికే నడుచుకుంటూ వచ్చారు. సినిమాల్లో తప్ప ఇలాంటి సన్నివేషాలు నిజ జీవితంలో జరగడం చాలా అరుదు. అలాంటి కల నెరవేరిందని రమాదేవి సంతోషం వ్యక్తం చేశారు. అంతే కాకుండా తమ సమస్యలు అడిగి తెలుసుకున్నారని.. ఇంట్లో కేదారేశ్వరి వ్రతం జరుగుతోందని తెలుసుకొని చెప్పులు విడిచి ఇంట్లోకి వచ్చారని చెప్పారు. ప్రియాంక గాంధీ పలకరించిన తీరు తన మనసులకు హత్తుకుందని రమాదేవి, రాజయ్య దంపతులు ఆనందం వ్యక్తం చేశారు. నంబర్ అడిగి తీసుకున్నారని.. సమస్యలు ఉంటే తనకే నేరుగా చెప్పాలని అభయం ఇచ్చారని హర్షం వ్యక్తం చేశారు.
తెలంగాణ ఎన్నికల ప్రచారంలో ఏఐసీసీ అగ్రనేత ప్రియాంక గాంధీ ఇక్కడి ప్రజల మనసులను చూరగొంటున్నారు. కాంగ్రెస్ 6 గ్యారెంటీలకు తాను గ్యారెంటీ అని హామీ ఇస్తున్నారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనా వైఫల్యాలను ఎండగడుతున్నారు. బీజేపీతో బీఆర్ఎస్ లోపాయికారిగా జట్టుకట్టి కేసీఆర్ ప్రజల నడ్డి విరుస్తున్నారని మండిపడుతున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇందిరమ్మ రాజ్యం తెస్తామని పేదల కష్టాలు దూరం చేస్తామని చెబుతున్నారు. ప్రచార సభలతో పాటు రోడ్ షోలతో ప్రజలను ఉత్సాహపరుస్తున్నారు. ప్రియాంక వాహనంలోనే స్థానిక లంబాడీలు మైమరచిపోయి నృత్యాలు చేస్తుండగా ఆమె కూడా కదం కలుపుతున్నారు. ఇందిరమ్మే తమ ముందుకు నడిచి వచ్చారని సంబరాలు చేసుకుంటున్నారు. ప్రియాంక కూడా వాళ్లతో మమేకమవుతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని.. హామీలన్నీ నెరవేర్చి కష్టాలు దూరం చేస్తామని భరోసా ఇస్తున్నారు. మహిళా కూలీలను ఆప్యాయంగా పలకరిస్తూ వారితో కరచాలనం చేస్తున్నారు. కష్టాలు అడిగి తెలుసుకుంటున్నారు. సెల్ఫీలు దిగుతూ ఉత్సాహపరుస్తున్నారు.
బహిరంగ సభల్లోనూ ప్రియాంక గాంధీ ప్రసంగాలకు జనం నుంచి మంచి స్పందన వస్తోంది. బీఆర్ఎస్-బీజేపీ బీ టీమ్ బంధాన్ని గట్టిగా ఎండగుడుతున్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ ఇచ్చామని.. కానీ, కేసీఆర్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటన్నారని ప్రియాంక గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. మార్పురావాలంటే కాంగ్రెస్ రావాలంటూ తెలుగులో మాట్లాడి జోష్ నింపుతున్నారు. జై తెలంగాణ అని నినదిస్తున్నారు. కేసీఆర్ కుటుంబానికే ఉద్యోగాలు వచ్చాయని.. బీఆర్ఎస్ను ఓడిస్తే నిరుద్యోగులకు జాబ్స్ వస్తాయని చెబుతున్నారు. కాంగ్రెస్ సర్కార్తోనే రైతు రుణమాఫీ జరుగుతుందని ప్రియాంక గాంధీ భరోసా ఇస్తున్నారు.
బీఆర్ఎస్ పాలన పూర్తిగా అవినీతి మయంగా మారిందని ప్రియాంక గాంధీ ఎండగడుతున్నారు. నెహ్రూ, ఇందిరా, రాజీవ్, సోనియా గాంధీ ప్రజాస్వామ్యంలో ప్రజలే అత్యున్నతమైన వాళ్లని భావిస్తారని.. అయితే కేసీఆర్, మోడీ మాత్రం తామే సుప్రీం అనుకుంటున్నారని ఫైరయ్యారు. దేశంలో ప్రజలే నాయకులని స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తామన్నారు.