Mann Ki Bath: అతనొక చిన్న పాటి కార్మికుడు. ఫిట్టర్ గా పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. అయితేనేమి తనకు ప్రకృతిపై ఉన్న మమకారంతో.. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని తాను కొనసాగించడమే కాక.. ఇతరులతో సైతం మొక్కలను నాటిస్తూ.. భవిష్యత్ తరాలకు కాలుష్య రహిత పర్యావరణమే అందించేందుకు కృషి చేస్తున్నారు. అతని కృషి ఫలితమే.. నేడు సాక్షాత్తు దేశ ప్రధాని చేత ప్రశంసలు అందుకున్నాడు. అతడు ఎవరో కాదు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన కొత్తూరు నుర్వి రాజశేఖర్.
భద్రాద్రి కొత్తగూడెంకు చెందిన రాజశేఖర్ స్థానికంగా సింగరేణి కాలరీస్ లో సెంట్రల్ వర్క్ షాప్ నందు ట్విట్టర్ గా పని చేస్తున్నారు. అయితే బాల్యం నుండి మొక్కలపై రాజశేఖర్ కు మక్కువ ఎక్కువ. మానవాళి మాదిరిగానే మొక్కలకు ప్రాణం ఉంటుందని, మానవాళి ప్రయోజనాల కోసం మొక్కలను పరిరక్షించాల్సిన అవసరం ఉందని గ్రహించారు. అనుకున్నదే తడవుగా 2016 నుండి ప్రపంచ పర్యావరణ పరిరక్షణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు రాజశేఖర్. తాను మొక్కలు నాటడమే కాక.. పుట్టినరోజులు, పెళ్లి రోజుల సందర్భంగా ఇతరుల చేత సైతం మొక్కలు నటించడం అలవాటుగా మార్చుకున్నారు. ఈయన మాట్లాడే నాలుగు మాటల్లో రెండు మాటలు మొక్కలు నాటడం, పర్యావరణ పరిరక్షణపైనే ఉంటాయని చెప్పవచ్చు. అందుకే రాజశేఖర్ కి ఎన్నో అవార్డులు, ప్రముఖుల ప్రశంసలు అందాయి. ఓ వైపు కుటుంబ పోషణ, మరోవైపు సామాజిక అంశాలపై అవగాహన కల్పించడం రాజశేఖర్ రోజువారీ దినచర్యగా మార్చుకున్నారు.
అంతేకాదు రాజశేఖర్ ఎక్కడైనా శుభకార్యాలకు వెళ్లారంటే చాలు.. అక్కడ ఇచ్చే గిఫ్ట్ కూడా పర్యావరణ పరిరక్షణకు సంబంధించినదే. ఏదైనా మొక్కను అందించడం గాని, లేక పక్షుల గూడును బహుమతిగా అందించడం అలవాటుగా మార్చుకున్నారు. అంతేకాదు చిన్నపాటి కార్మికుడిగా పని చేస్తున్న రాజశేఖర్ కోటి విత్తనాలు నాటాలన్న లక్ష్యాన్ని ఎంచుకొని నేటికీ 10 లక్షలకు పైగా మొక్కలు విత్తనాలను పంపిణీ చేశారు. రాజశేఖర్ ఇంటి వద్ద నుండి కదిలారంటే చాలు… ఆయన ద్విచక్ర వాహనంలో తప్పనిసరిగా మొక్కలు ఉండాల్సిందే. వాటిని పంచుతూ.. రాబోయే తరాల కోసం మొక్కలు నాటాలని అవగాహన కల్పిస్తారు. ఇలా పర్యావరణ పరిరక్షణపై నిరంతరం అవగాహన కల్పిస్తున్న రాజశేఖర సేవలను సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోడీ సైతం గుర్తించారు. తాజాగా మన్ కీ బాత్ కార్యక్రమంలో రాజశేఖర్ పేరును ప్రధాని ఉచ్చరించి.. రాజశేఖర్ మీ సేవా తత్పరత అదరహో అంటూ అభినందించి ప్రోత్సహించారు. చేసే పనిలో నిజాయితీ ఉంటే చాలు.. ప్రశంసలు వాటికి అవే వస్తాయనడంలో రాజశేఖర్ ను ప్రధాని అభినందించడమే ఉదాహరణగా చెప్పవచ్చు. మరి రాజశేఖర్ బాటలో నేటి యువత నడుస్తూ.. మొక్కలను నాటి, వాటిని పరిరక్షించాలని పర్యావరణ వేత్తలు కోరుతున్నారు.