President Murmu Comment: మహిళల విషయంలో మన సమాజం ఆలోచనా ధోరణి మారాలని భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పేర్కొన్నారు. దేశంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు సమర్థవంతంగా చెక్ పెట్టేందుకు, కేసుల సత్వర పరిష్కారం కోసం మహిళా లాయర్లతో జాతీయ స్థాయిలో ఒక బలమైన నెట్వర్క్ ఏర్పాటు చేయాల్సి ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. శనివారం హైదరాబాద్ శివారులోని నల్సార్ యూనివర్సిటీ 21వ స్నాతకోత్సవంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వర్సిటీలోని వివిధ విభాగాలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బంగారు పతకాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ హైకోర్టు గవర్నర్ అలోక్ అరాధే, తదితరులు హాజరయ్యారు.
ఆ పూచీ వర్సీటీలదే..
అనేక రంగాల్లో ముందడుగు వేసిన మన సమాజం.. మహిళాభ్యుదయం విషయంలో మాత్రం వెనకబడే ఉందని రాష్ట్రపతి ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో ఏదోమూల నేటికీ వారిపై జరుగుతున్న అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయని, వాటిని అరికట్టాలంటే నల్సార్ వంటి లా వర్సిటీలన్నీ కలిసి, మహిళా వకీళ్లుగా ఉన్న తమ పూర్వ విద్యార్థులతో ఓ జాతీయ నెట్వర్క్ ఏర్పాటు చేసేందుకు ముందుకు రావాలన్నారు.
పేదల పక్షాన నిలవండి..
మనదేశంలో నేటికీ సంపన్నులకు అందినంత వేగంగా పేదలకు న్యాయం అందటం లేదని, కనుక న్యాయవాదులు, అట్టడుగు వర్గాల బాధితుల పక్షాన నిలబడి వారికి న్యాయం చేయాలని పిలుపునిచ్చారు. దక్షిణాఫ్రికా నుంచి మహాత్మా గాంధీ బీహార్లోని చంపారన్ పేద రైతుల పక్షాన నిలిచి విజయం సాధించారని గుర్తుచేశారు. ప్రతి 10 గ్రామాలకు ముగ్గురు న్యాయాధికారులు ఉండాలని, వివాదం పరిష్కారం అయ్యే వరకు జడ్జీలు, పిటిషనర్ల మధ్య ఎలాంటి ప్రైవేట్ సంభాషణలు ఉండకూడదని చాణిక్యుడు తన అర్థశాస్త్రంలో చెప్పిన విషయాన్ని ముర్ము ప్రస్తావించారు.
నల్సార్ కోర్సులు భేష్..
నల్సార్ యూనివర్సిటీలో కృత్రిమ మేధ (ఎఐ)ను ఒక అధ్యయనాంశంగా గుర్తించటం పట్ల రాష్ట్రపతి సంతోషం వ్యక్తం చేశారు. అలాగే, వర్సిటీలో జంతు న్యాయ కేంద్రం ఏర్పాటు తనకెంతో సంతోషం కలిగించిందని, దాదాపు రెండు దశాబ్దాల క్రితం తాను ఒడిసా రాష్ట్ర మత్స్య-జంతు వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేసిన రోజుల నాటి అనుభవాలను తనకు ఈ కేంద్రం మరోసారి గుర్తుకుతెచ్చిందని ముర్ము పేర్కొన్నారు.
ఘన స్వాగతం..
ఉదయం హకీంపేట విమానాశ్రయానికి వచ్చిన రాష్ట్రపతికి గవర్నర్, ముఖ్యమంత్రి, మంత్రి సీతక్క, మేయర్ తదితరులు ఘన స్వాగతం పలికారు. నల్సార్ వర్సిటీ స్నాతకోత్సవం తర్వాత బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి చేరుకున్న ముర్ము.. అక్కడ ఏర్పాటు చేసిన భారతీయ కళా మహోత్సవ్ను ప్రారంభించారు. ఎనిమిది రోజుల పాటు ఈ కార్యక్రమం సాగనుంది. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా ‘మినిస్టర్ ఇన్ వెయిటింగ్’గా మంత్రి సీతక్కను రాష్ట్ర ప్రభుత్వం నామినేట్ చేసింది. దీంతో రాష్ట్రపతిని స్వాగతించడం మొదలు సాగనంపడం వరకు ముర్ము వెంట సీతక్క ఉన్నారు.