దేశమంతా అయోధ్యలోని భవ్య రామమందిరంలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ సుముహూర్తం కోసం ఎదురుచూస్తోంది. ఈ రోజు మధ్యాహ్నం 12.20 నిమిషాలకు ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ప్రారంభమవుతుంది. రాముడు అంటేనే భారతీయుల్లో, అందునా హిందువుల్లో ఒక భావోద్వేగం. తమకు పుట్టబోయే బిడ్డ రాముడి అంశలోనే పుట్టాలన్న కోరిక ప్రతి జంటకూ ఉంటుంది.
అందుకే, నెలలు నిండిన తన భార్యకు సరిగ్గా అదే ముహూర్తంలో ప్రసవం చేయాలని ఓ జంట కిమ్స్ కడల్స్ సికింద్రాబాద్ వైద్యులను కోరారు. నగరంలోని ప్రధాన ఆస్పత్రులలో ఒకటైన కిమ్స్ కడల్స్ ఆస్పత్రిలో ఓ జంట ఇప్పటికే అడ్మిషన్ కూడా తీసుకున్నారు. షాద్నగర్ సమీపానికి చెందిన భార్య పీజీ చేయగా, భర్త బీహెఎచ్ఈఎల్ (BHEL)వద్ద ఉద్యోగం చేస్తుంటారు. వీరికి ఇది మొదటి కాన్పు కావడంతో ఆమె తన పుట్టింటికి వచ్చి, కిమ్స్ కడల్స్ సికింద్రాబాద్ ఆస్పత్రిలో చూపించుకుంటున్నారు.
తమకు బాల రాముడి ప్రాణప్రతిష్ఠ జరిగే సమయానికే ప్రసవం అయ్యేలా చూడాలని కోరారు. ఆమెకు ప్రసవ సమయం దగ్గర పడటంలో ఎలాంటి సమస్యలు లేకపోవడంతో సోమవారం మధ్యాహ్నం సరిగ్గా 12.20 గంటలకే శిశువు పుట్టేలా చూడాలని వైద్యులను కోరారు. మరొకరు కూడా అడగగా.. ఆమెకు కొన్ని ఆరోగ్యపరమైన సమస్యలు ఉండటంతో రెండు రోజులు ముందుగానే ప్రసవం చేయాల్సి వచ్చింది.
జంటనగరాల్లో మాతా శిశు సంరక్షణలో పేరెన్నిక గన్నది.. కిమ్స్ కడల్స్ సికింద్రాబాద్ ఆస్పత్రి. ఇక్కడ సగటున నెలకు 40-50 ప్రసవాలు అవుతాయి. అత్యంత నిపుణులైన వైద్యులతో పాటు సుశిక్షితులైన నర్సింగ్ సిబ్బంది ఇక్కడ ఉంటారు. యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ నిర్మల తదితరుల నేతృత్వంలో ఇక్కడ అత్యంత సంక్లిష్టమైన కేసుల్లో కూడా సుఖ ప్రసవాలు చేస్తుంటారు.