PRC For TSRTC Employees: తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. 21 శాతం ఫిట్మెంట్తో పీఆర్సీ ఇచ్చింది. ఈ కొత్త ఫిట్మెంట్ జూన్ 1 నుంచి అమల్లోకి రానున్నట్లు తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. 2017 నుంచి 21 శాతం ఫిట్మెంట్తో పీఆర్సీ అమలుచేస్తామని మంత్రి పేర్కొన్నారు.
ఈ పీఆర్సీ ప్రకటనతో ఆర్టీసీపై నెలకు రూ. 35 కోట్ల భారం పడనుంది. ఈ ప్రకటనతో 53,701 మంది టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనం చేకూరనుంది.
తెలంగాణ ఉద్యమంలో ముఖ్యపాత్ర పోషించిన ఆర్టీసీ ఉద్యోగులను గత ప్రభుత్వం విస్మరించింది. రెండు పీఆర్సీలు ప్రకటించాల్సి ఉన్నా ఐ. ఆర్ తో సరిపెట్టింది. దీంతో ఉద్యోగులకు అధికారంలోకి రాగానే వేతన సవరణ చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు హామీ ఇచ్చింది. చెప్పినట్టుగానే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మూడు నెలల లోపే ఆర్టీసీ ఉద్యోగులకు 21 శాతం ఫిట్మెంట్తో వేతన సవరణ చేసింది. దీంతో టీఎస్ఆర్టీసీ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు.