Pravallika Case Update : ప్రవళిక అత్మహత్య కేసులో మరో ట్విస్ట్ నెలకొంది. శివరాం రిమాండ్ పిటిషన్ను నాంపల్లి కోర్టు కొట్టివేసింది. అతనికి బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. కేసులో సరైన ఆధారాలు లేకపోవడంతో శివరాంకు బెయిల్ చేస్తున్నట్లు న్యాయస్థానం వెల్లడించింది. 5 వేల రూపాయల వ్యక్తిగత పూచికత్తుతో శివరాంను వదిలేయాలని ఆదేశాలు జారీ చేసింది.
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రవళిక ఆత్మహత్య కేసులో నిందితుడుగా ఉన్న శివరాం రాథోడ్ శుక్రవారం కోర్టులో లొంగిపోయాడు. నాంపల్లి కోర్టును ఆశ్రయించగా.. శివరాం తరుపు న్యాయవాది మెమో దాఖలు చేశారు. కోర్టులో విచారణ జరిగిన అనంతరం.. శివరాం రిమాండ్ పిటీషన్ను ఎలాంటి ఆధారాలు లేనందున నాంపల్లి కోర్టు తిరస్కరించింది. చాటింగ్ ఆధారాలతో రిమాండ్ ఎలా చేస్తారని పోలీసులను కోర్టు ప్రశ్నించింది. దీంతో పాటు కేసు దర్యాప్తు జరుగుతున్నందున రిమాండ్ ఇవ్వలేమని వెల్లడించింది.
కేసు పూర్తి వివరాలు తెలియజేస్తామని శివరాం న్యాయవాది కోర్టుకు తెలిపారు. అనంతరం ప్రవళిక ఆత్మహత్యకు కారణమని శివరాంపై కేసు నమోదు చేసింది. దీంతో కోర్టులోనే శివరాంను చిక్కడపల్లి పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్స్టేషన్కు తరలించారు. శనివారం ఉదయం శివరాంను నాంపల్లి కోర్టులో హాజరుపరుచగా.. న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది.