Ambedkar Jayanti in Telangana: కావాలని అన్నారో, లేదంటే కాకతాళీయమో తెలీదు కానీ.. ప్రకాశ్ అంబేడ్కర్ సంచలన కామెంట్ చేశారు. అది కూడా సీఎం కేసీఆర్ సమక్షంలో. బీఆర్ అంబేడ్కర్ కాంస్య విగ్రహ ప్రారంభోత్సవానికి విశిష్ట అతిథిగా హాజరైన అంబేడ్కర్ మనువడు ప్రకాశ్.. ఓ ఆసక్తికర ప్రతిపాదన చేశారు. ఆయన పాజిటివ్ యాంగిల్లో ఆ ప్రపోజల్ చేసినా.. అది పరోక్షంగా సీఎం కేసీఆర్కు బిగ్ మైనస్ అవుతుందనే చర్చ మొదలైంది. ఇంతకీ ప్రకాశ్ అంబేడ్కర్ ఏమన్నారంటే…
హైదరాబాద్ను భారతదేశానికి రెండో రాజధానిగా చేస్తే బాగుంటుందని ప్రకాశ్ అంబేడ్కర్ అన్నారు. ఈ ప్రతిపాదన తనది కాదని.. అప్పట్లో బీఆర్ అంబేడ్కరే హైదరాబాద్ దేశ రెండో రాజధానిగా ఉంటే బాగుంటుందని ప్రతిపాదించారని చెప్పారు. రాజధాని ఢిల్లీ.. పాకిస్తాన్, చైనాలకు సమీపంలో ఉంటుందని.. అదే హైదరాబాద్ అయితే సెక్యూరిటీ పరంగా పటిష్టంగా ఉంటుందని బీఆర్ అంబేడ్కర్ ఓ సందర్భంగా చెప్పినట్టు గుర్తు చేశారు ఆయన మనువడు ప్రకాశ్. ఆ మేరకు సీఎం కేసీఆర్ ప్రయత్నించాలని సూచించారు.
పైపైన వింటుంటే ఇదంతా మంచి న్యూసే అనిపిస్తుంది. కానీ, కేసీఆర్ను ఇరకాటంలో పడేసే ప్రతిపాదన ఇది అంటున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలోనే ఈ టాపిక్పై చర్చ నడిచింది. ప్రత్యేక తెలంగాణను ఇస్తూనే.. హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చి, దేశానికి రెండో రాజధానిగా చేస్తారంటూ ప్రచారం జరిగింది. దేశ రెండో రాజధాని వరకు అయితే ఓకే కానీ.. కేంద్రపాలిత ప్రాంతంగా మార్చితే మొదటికే మోసం వస్తుందంటూ తెలంగాణవాదులు ముక్తకంఠంతో వ్యతిరేకించారు. ఈ ప్రతిపాదనకు సమైక్యాంధ్ర వాదులు మాత్రం మద్దతు తెలిపారు. అలా కొన్నివారాల పాటు.. హైదరాబాద్ దేశానికి రెండో రాజధానిగా చేస్తే లాభనష్టాలపై విస్తృత చర్చ..రచ్చ జరిగింది.
కట్ చేస్తే.. అదే ప్రతిపాదనను ఇప్పుడు ప్రకాశ్ అంబేడ్కర్ సైతం హైదరాబాద్ను రెండో రాజధానిగా ఏర్పాటు చేస్తే బాగుంటుందని.. అందుకు ప్రయత్నించాలంటూ సీఎం కేసీఆర్కే సూచించడం ఆసక్తికరంగా మారింది. సెకండ్ కేపిటల్ వరకు ఓకే.. మరి, రాష్ట్ర హోదాను కంటిన్యూ చేస్తూనే కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటిస్తే..? ఢిల్లీలానే కేంద్రం పెత్తనం పెరగదా? అది తెలంగాణకు లాభమా? నష్టమా? మరోసారి చర్చనీయాంశమైంది ఈ ప్రతిపాదన.