Postal Ballots In Telangana : తెలంగాణ ఎన్నికల్లో ఈసారి రికార్డ్ స్థాయిలో పోస్టల్ బ్యాలెట్లు పోలయ్యాయి. అంతేకాదు సమయానికి ఉద్యోగులకి పోస్టల్ బ్యాలెట్లు అందకపోవడంతో అందరూ ధర్నాలు చేయడం, నిరసనలకు దిగడం, ఆఖరికి కోర్టుకి కూడా వెళ్లేసరికి ఉన్నతాధికారులందరూ దెబ్బకి దారిలోకి వచ్చారు. అప్పటికప్పుడు పంపిణీ చేశారు. ఈ నేపథ్యంలోనే దాదాపు 2 లక్షల పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యి రికార్డ్ బ్రేక్ చేశాయి.
1, 99,200 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలైనట్టు అధికారికంగా ధ్రవీకరించారు. వీటిని ఎక్కువగా ఉద్యోగ వర్గాలు ఉపయోగిస్తుంటాయి. పోలింగ్ డే నాడు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల సరళిని చూస్తే, కేసీఆర్ కి వ్యతిరేకంగా, కాంగ్రెస్ కి అనుకూలంగా పడటం విశేషం.
పోస్టల్ బ్యాలెట్లలో ఆధిక్యం లభించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో సీఎం రేవంత్ రెడ్డి( కొడంగల్), తుమ్మల నాగేశ్వరరావు (ఖమ్మం), పొంగులేటి శ్రీనివాసరెడ్డి (పాలేరు), భట్టి విక్రమార్క ( మధిర) రేవూరి ప్రకాశ్ రెడ్డి (పరకాల), నాగరాజు (వర్థన్నపేట), కోమటిరెడ్డి వెంకటరెడ్డి (నల్గొండ), వినోద్ (బెల్లంపల్లి) , ప్రేమసాగర్ (మంచిర్యాల) తదితరులు ఉన్నారు.
ఉద్యోగులకు సంబంధించి రావల్సిన బకాయిలు ఆలస్యంగా ఇవ్వడం, జీతాలు ఆలస్యంగా ఇవ్వడం, సంక్షేమ పథకాలకు ప్రాధాన్యత ఇచ్చి, ఉద్యోగులు ఎలా పోయినా పర్వాలేదని పట్టించుకోకపోవడంతో కేసీఆర్ సర్కార్ పై కాక ఎక్కిపోయి ఉన్న వారు వ్యతిరేక ఓటు వేశారని అంటున్నారు.
ఖమ్మంలో అత్యధికంగా 5,500 ఓట్లు, కరీంనగర్ లో 5,307 పోస్టల్ బ్యాటెల్ ఓట్లు నమోదయ్యాయి. మరోవైపు హోం ఓటింగ్ ద్వారా 27,718 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
గత ఎన్నికల్లో చూస్తే కేవలం ఒక లక్ష ఓట్లు మాత్రమే పోస్టల్ బ్యాలెట్ ద్వారా నమోదైతే, ఈసారి డబుల్ కావడం విశేషం. కావాలని ఉద్యోగులు కోర్టుకి కూడా వెళ్లి తమ పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్నారు.ఇంకా చాలా మందికి పోస్టల్ బ్యాలెట్లు అందలేదు.. అవి కూడా అందితే ఇంకా ఎక్కువ సంఖ్యలో పోలయ్యేవి. అదే భావన ఒక్క ఉద్యోగులే కాదు, అన్ని వర్గాలపై పడటంతో బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయింది.