Ponguleti : రాజకీయ భవిష్యత్తుపై పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆహ్వానానికి సానుకూలంగా స్పందించారు. కాంగ్రెస్ లో చేరాలని పొంగులేటి నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. జూన్ 2 లేదా జూన్ 8న కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉందని సమాచారం.
అనుచరుల అభిప్రాయాలు, స్థానిక పరిస్థితులు ఆధారంగా కాంగ్రెస్ లో చేరాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ తో గట్టిగా పోరాడేది కాంగ్రెస్ పార్టీ అని ఆయన భావిస్తున్నారని సమాచారం.
ఇప్పటికే రాహుల్ గాంధీతో పొంగులేటి చర్చలు జరిపారు. జూన్ 2న హైదరాబాద్ లోని బోయిన్పల్లిలో గాంధీ ఐడియాలజీ సెంటర్కు శంకుస్థాపన కార్యక్రమం ఉంది. ఆ రోజు జరిగ సభలో పొంగులేటితోపాటు జూపల్లి కృష్ణారావు కూడా కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని సమాచారం. జూన్ మొదటివారంలో యూఎస్కు రాహుల్, రేవంత్రెడ్డి వెళ్లే ఛాన్స్ ఉంది. వారి అమెరికా పర్యటన ఖరారైతే బోయిన్పల్లి మీటింగ్ జూన్8న జరిగే అవకాశం ఉంది.రాహుల్, రేవంత్ అమెరికా టూర్ను బట్టి పొంగులేటి కాంగ్రెస్లో చేరే తేదీ ఫిక్స్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. పొంగులేటి చేరితే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ మరింత బలపడుతుంది.