Ponguleti: మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి వాయిస్ పెంచారు. తూటాల్లాంటి డైలాగులు పేల్చారు. ఎక్కడా కేసీఆర్ పేరు ఎత్తకున్నా.. తనలోని అసంతృప్త జ్వాలను బయటకు వెళ్లగక్కారు. అధికారం ఉందని అసెంబ్లీని సామ్రాజ్యంగా చేసుకొని దోచుకుంటున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు. మీరు అధికార మదంతో రెచ్చిపోయినా.. ప్రజలు తీర్పు ఇచ్చే రోజు ఎంతో దూరంలో లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
మీరు నన్ను ఇబ్బంది పెట్టవచ్చు.. మిమ్మల్ని కొట్టేవారు ఉంటారు.. చేస్తున్న ప్రతీ పనికి అనుభవించక తప్పదు..
వడ్డీతో సహా తిరిగి చెల్లించాల్సి వస్తుంది.. అంటూ ఓ రేంజ్ లో వార్నింగులు ఇచ్చారు పొంగులేటి.
పదవులు ఇవ్వకపోయినా మనిషిని మనిషిలా చూడండంటూ కాస్త సెంటిమెంట్ సైతం రంగరించారు పొంగులేటి. ఇటీవల ఆయన సెక్యూరిటీని తగ్గించడం పైనా స్పందించారు. తాను అడిగితే సెక్యూరిటీ ఇవ్వలేదని.. ఇప్పుడు తగ్గించినా తాను అడగబోనని.. ఉన్న ఇద్దరు గన్ మెన్లను సైతం వెనక్కి తీసుకోండంటూ తేల్చి చెప్పారు.
ఇక, ఖమ్మం జిల్లా ఎమ్మెల్యేలపైనా మండిపడ్డారాయన. ఎమ్మెల్యేలు వారి ప్రాంతాలకు రాజుల్లా అరాచకాలు చేస్తున్నారంటూ విరుచుకుపడ్డారు. తనకు ఏళ్లుగా ఎలాంటి పదవులు ఇవ్వలేదని.. నాలుగేళ్లుగా అవమానాలు భరిస్తూ వచ్చానని ఆవేదన వ్యక్తం చేశారు.
ఖమ్మం జిల్లా పినపాకలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇలాంటి సంచలన వ్యాఖ్యలు చేయడ కలకలం రేపుతోంది. పైగా ఆ సమావేశంలో పెట్టిన ఫ్లెక్సీల్లో పొంగులేటి మినహా కేసీఆర్, కేటీఆర్ ఫోటోలు లేవు. ఇక పొంగులేటితో సహా ఆ మీటింగ్ వచ్చినవారెవరూ బీఆర్ఎస్ కండువాలు వేసుకోలేదు. దీంతో.. పొంగులేటి పార్టీని వీడటం ఖాయమని బహిరంగంగా తేలిపోయింది.
అయితే, పొంగులేటి వ్యాఖ్యలను బీఆర్ఎస్ అధిష్టానం సీరియస్ గా తీసుకున్నట్టు తెలుస్తోంది. కొన్నిరోజులుగా వరుసగా రెబెల్ స్టేట్ మెంట్స్ ఇస్తుండటం.. బీజేపీలో చేరేందుకు సిద్దమవుతుండటం అందరికీ తెలిసిందే. సైలెంట్ గా వెళ్లిపోతారని అనుకుంటే.. ఇలా సంచలన వ్యాఖ్యలతో కలకలం రేపుతుండటంతో.. పార్టీని వీడేలోగా ఆయనపై క్రమశిక్షణ చర్యలు ఉంటాయని అంటున్నారు.