Ponguleti Srinivasa Reddy:ఇల్లందు పాలిటిక్స్ హీటెక్కుతున్నాయ్. నియోజకవర్గంలో తమ పట్టును నిలుపుకోవడానికి పోటాపోటీగా ఆత్మీయ సమావేశాలు నిర్వహించేందుకు నేతలు సిద్ధమవుతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ తమ అనుచర వర్గం చేజారిపోకుండా నాయకులు జాగ్రత్త పడుతున్నారు.
కొంతకాలంగా బీఆర్ఎస్ కు దూరంగా ఉంటూ వస్తున్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. ప్రస్తుతం పొలిటికల్ జంక్షన్లో ఉన్నారు. ఏ పార్టీలో చేరాలో తేల్చుకోలేకపోతున్నారు. ఇదే విషయమై నిర్ణయం తీసుకునేందుకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అన్ని నియోజకవర్గాలలో ఆత్మీయ సమావేశాలను నిర్వహిస్తున్నారు. తన అనుచరులను సమావేశాలకు ఆహ్వానించి వారి అభిప్రాయాలను తెలుసుకుంటున్నారు. ఏ పార్టీలో చేరితే బాగుంటుందన్న అంశంపై నాయకుల సలహాలు, సూచనలు తీసుకుంటున్నారు.
ఈ క్రమంలో ఈ నెల 23న ఇల్లందులో భారీ ఎత్తున ఆత్మీయ సమావేశం నిర్వహించేందుకు పొంగులేటి వర్గీయులు ఏర్పాట్లు చేస్తున్నారు. పట్టణ శివారులోని ఓ మామిడి తోటలో సమావేశానికి సంబధించిన ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయ్. నియోజకవర్గంలోని సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలతో పాటు… పది నుంచి 15 వేల మంది వరకు కార్యకర్తలు ఈ ఆత్మీయ సమావేశానికి హాజరవుతారని పొంగులేటి వర్గీయులు చెబుతున్నారు.
మరో వైపు పొంగులేటి వర్గానికి పోటీగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే బానోతు హరిప్రియ నాయక్ వర్గీయులు కూడా ఆత్మీయ సమ్మేళనం నిర్వహించేందుకు రెడీ అవుతున్నారు. అది కూడా పొంగులేటి వర్గీయులు ప్రకటించిన 23వ తేదీ రోజే హరిప్రియ అనుచరులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించడానికి సిద్ధమవుతున్నారు. పొంగులేటి బీఆర్ఎస్ ను వీడి.. మరో పార్టీలో చేరడం దాదాపు ఖాయం కావడంతో ఆయన వెంట కార్యకర్తలు, నాయకులు ఎవరూ వెళ్లకుండా హరిప్రియ కట్టడి చర్యలు చేపట్టారు.
ఇదిలా ఉంటే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఆయన నివాసంలో ఖమ్మం కాంగ్రెస్ కార్పొరేటర్లు కలిశారు. పార్టీలోకి రావాలని పొంగులేటిని ఆహ్వానించారు. మీరు పార్టీలోకి వస్తే ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ కు తిరుగుండదని.. కార్పొరేటర్లు పొంగులేటితో అన్నట్లు తెలుస్తోంది. అయితే నిర్ణయం తీసుకోవడానికి ఇంకా సమయం ఉందని.. కార్పొరేటర్లకు నచ్చజెప్పి పంపించేశారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.