Ponguleti: బినామీ కాంట్రాక్టులు తీసుకున్న వారిని వదలిపెట్టే పరిస్థితే లేదని రెవెన్యూ , గృహనిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. గత ప్రభుత్వం రాష్ట్ర ఖజానాను మొత్తం ఖాళీ చేసి ఇచ్చింది, అయినా మేము ఆరు గ్యారెంటీలను అమలు చేసి తీరుతామన్నారు. రాష్ట్రంలో బినామీ కాంట్రాక్టులు తీసుకున్న వారిని ఎట్టి పరిస్థితిలో వదలిపెట్టే పరిస్థితే లేదన్నారు.
ఆనాటి ప్రభుత్వంలో అధికారులు చేసిన తప్పులను ఎత్తి చూపించి వేధింపులకు గురి చేసే వారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అధికారులను వేధింపులకు గురి చేయమన్నారు. తమది కక్ష్య సాధింపు ప్రభుత్వం కాదన్నారు. పేదలకు న్యాయం చేసే ప్రభుత్వం అన్నారు. అందరం కలిసి సమన్వయంతో పేదలకు న్యాయం చేయాలన్నారు. ప్రభుత్వ ఆస్తులు కొల్లగొట్టిన వారిని వదిపెట్టమన్నారు .
కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలకు సంబంధించి శ్వేతపత్రాలను ఈ నెల 20న ప్రజల ముందు ఉంచుతామని పొంగులేటి స్పష్టం చేశారు. ఇప్పటికే రెండు గ్యారెంటీలు అమలు జరుగుతున్నాయని, ఈ నెల 28 నుంచి మిగతా రెండు గ్యారంటీలను అమలు చేస్తామన్నారు. గత ప్రభుత్వంలా హామీలు ఇచ్చి మర్చిపోయే ప్రభుత్వం తమది కాదని, ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసి తీరుతామన్నారు.