Ponguleti: ఖమ్మం మాజీ ఎంపీ, బీఆర్ఎస్ నుంచి సస్పెన్షన్కు గురైన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దారెటు? కాంగ్రెస్లో చేరబోతున్నారా? ఖమ్మం గుమ్మంలో ఇప్పుడీ ప్రచారం జోరుగా సాగుతోంది. కాంగ్రెస్కు చెందిన ముస్తఫా అనే కార్యకర్తను పొంగులేటి పరామర్శించడంతో ఈ ప్రచారానికి బలం చేకూరుతోంది. ఇంతకీ ఆయన మళ్లీ పాతగూటికే చేరుతున్నారా..?
పొంగులేటిని చేర్చుకోవాలని బీజేపీ తెగ ప్రయత్నం చేస్తోంది కాని ఆయన మాత్రం పెద్దగా ఇంట్రెస్ట్ చూపడం లేదు. ఎన్నికలకు సమయం సమీపిస్తోన్న నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో ఏమాత్రం బలం లేని బీజేపీలో చేరడం అమాయకత్వం అవుతుందనే ఆలోచనతో పొంగులేటి ఉన్నట్టు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల ఫలితాలు ఏమాత్రం తేడా కొట్టినా తన రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారుతుందని పొంగులేటి ఆలోచిస్తున్నారు. ఎన్నికలకు మరెంతో సమయం కూడా లేదు. ఈ తక్కువ సమయంలో బీజేపీని జిల్లా రాజకీయాల్లో బలీయమైన శక్తిగా మార్చడమంటే ఆషామాషీ కాదని భావిస్తున్నారు. అందుకే కాంగ్రెస్లో చేరితేనే బెటర్ అనే తలంపుతో పొంగులేటి ఉన్నారని.. కాంగ్రెస్లో చేరాలనే పొంగులేటి సూత్రాప్రాయ నిర్ణయానికి ఆయన అనుచరులు కూడా జైకొట్టారని తెలుస్తోంది.
బీఆర్ఎస్ను ధిక్కరించి కాంగ్రెస్లో చేరితే తనను ఆర్థికంగా దెబ్బకొట్టాలని బీఆర్ఎస్ పెద్దలు ప్రయత్నించే అవకాశం ఉందని పొంగులేటి మరో కోణంలో కూడా ఆలోచిస్తున్నారు. కాంగ్రెస్ ద్వారా కేసులను ఎదుర్కోవడం ఇబ్బంది అవుతుందని… బీజేపీలో చేరడమే రైట్ ఛాయిస్ అని మరో ఆలోచన కూడా పొంగులేటి చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఈటల లాంటి నేతలనే అక్రమ కేసులతో వేధించాలని చూశారు కాబట్టి తనను కూడా ఆర్థికంగా ఇబ్బంది పాలు చేసేందుకు సర్కార్ వెనుకంజ వేయదని పొంగులేటి ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఏదీ ఏమైనా జాతీయ పార్టీలో చేరుతానని స్పష్టం చేసిన పొంగులేటి ఈ నెలఖారులో తన నిర్ణయాన్ని వెలువరిస్తానని ప్రకటించడంతో మరికొద్ది రోజుల్లోనే ఆయన ఏ పార్టీలో చేరుతారనేది క్లారిటీ రానుంది.
15 రోజుల క్రితం వైరాలో రేణుకాచౌదరి హత్ సే హత్ జోడో యాత్ర నిర్వహించారు. ఖమ్మం టౌన్కు చెందిన ముస్తఫా ఆ యాత్రలో పాల్గొన్న సందర్భంలో అనుకోకుండా గాయపడ్డాడు. అతన్ని ఇంటికెళ్లి మరీ పరామర్శించారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఆయన కుటుంబసభ్యులతో, బంధువులతో ఆప్యాయంగా ముచ్చటించారు. దీంతో.. పొంగులేటి కాంగ్రెస్ గూటికి చేరడం ఖాయమంటూ ప్రచారం మొదలైంది. మొత్తంగా చూస్తే.. ఈ పొంగులేటి సొంత గూటికి తిరిగి చేరే అవకాశమే ఎక్కువగా కనిపిస్తోంది.