Singareni mines: ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటనతో సింగరేణి ఇష్యూ మరోసారి తెరపైకి వస్తోంది. సింగరేణి ప్రైవేటీకరణకు కేంద్రం ప్రయత్నిస్తోందని కేసీఆర్ సర్కార్ ఆరోపిస్తోంది. మరోవైపు ఈ ప్రైవేటీకరణపై కన్నేసింది కేసీఆరే అని బీజేపీ రివర్స్ కౌంటర్స్ ఇస్తోంది. బీజేపీ-బీఆర్ఎస్ లు కలిసి సింగరేణిని ఆటాడుకుంటున్నాయని కాంగ్రెస్ పార్టీ అంటోంది. ఓవరాల్ గా సింగరేణి చుట్టూ రాజకీయం రంజుగా సాగుతోంది. మోదీ టూర్ సందర్భంగా సింగరేణి ఏరియాల్లో జంగ్ సైరన్ కు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది.
సింగరేణి విషయంలో ఒక్కో పార్టీ ఒక్కో వెర్షన్ వినిపిస్తోంది. సింగరేణి సంస్థను కేంద్రం పూర్తిగా ప్రైవేటీకరించి చేతులు దులుపుకోవాలని చూస్తోందని మంత్రి కేటీఆర్ ఫైర్ అవుతున్నారు. సింగరేణిలోని బొగ్గు గనులను వేలం వేయాలని కేంద్రం మరోసారి నిర్ణయం తీసుకోవటంపై ఆగ్రహంతో ఉన్నారు. ఇది ప్రైవేటీకరించే కుట్రలో భాగమే అంటున్నారు. సింగరేణి కోసం ప్రత్యేకంగా గనులు కేటాయించాలని కోరినా, పట్టించుకోకుండా సత్తుపల్లి బ్లాక్ 3, శ్రావణపల్లి, పెనగడప గనుల వేలం కోసం కేంద్రం మరోసారి నోటిఫికేషన్ ఇచ్చిందని మందిపడుతున్నారు. మార్చి 29 నుంచి మే 30 వరకు ఈ గనులకు వేలం ప్రక్రియను నిర్వహించాలని కేంద్రం తీసుకొన్న నిర్ణయాన్ని వెంటనే వెనకి తీసుకోవాలని, వేలంతో సంబంధం లేకుండా సింగరేణికి నేరుగా గనులు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రధానిపై ఒత్తిడి తెచ్చేందుకు జంగ్ సైరన్ పేరుతో ఆందోళనలకు పిలుపునిచ్చారు కేటీఆర్.
మరోవైపు సింగరేణి ప్రైవేటీకరణపై బీజేపీ వెర్షన్ మరోలా ఉంది. 2022 నవంబర్ 12న రామగుండం వచ్చినప్పుడు ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు ప్రధాని మోదీ. సింగరేణిని ప్రైవేటీకరణ చేసే అధికారం కేంద్రానికి లేదని స్పష్టం చేసినప్పటికీ బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందని బీజేపీ నేతలు ఫైర్ అవుతున్నారు. కేసీఆర్ సింగరేణి కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమయ్యారంటూ రివర్స్ ఎటాక్ చేస్తున్నారు. కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేక కేంద్రంపై తప్పుడు ప్రచారం చేస్తూ వారి దృష్టిని మరలుస్తున్నారన్నారంటున్నారు. బొగ్గు గనుల వేలంలో సింగరేణి సంస్థ పాల్గొనే అవకాశం ఉన్నా.. రాష్ట్ర ప్రభుత్వం టెండర్లు వేయకుండా ప్రైవేటీకరణ అంటూ డ్రామాలకు దిగుతోందని బీజేపీ నేతలు ఫైర్ అవుతున్నారు. సింగరేణిలో 75 శాతం కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ సిబ్బందిని నియమించిన ఘనత సీఎం కేసీఆర్ దే అంటూ విమర్శలు చేస్తున్నారు. వేలంలో సింగరేణి సంస్థ పాల్గొనకుండా గనులను ప్రైవేట్ కు అప్పజెప్పే కుట్రలకు కేసీఆరే తెరలేపుతున్నారనేది బీజేపీ వాదన.
ఇక, సింగరేణి ప్రైవేటీకరణకు బీజేపీ, బీఆర్ఎస్ కుట్రలు పన్నుతున్నాయని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. దేశంలోని బొగ్గు గనులను ప్రైవేట్ సంస్థలకు అప్పగించడానికి కేంద్ర ప్రభుత్వం ఒక వైపు, రాష్ట్ర ప్రభుత్వం మరో వైపు చర్యలు ముమ్మరం చేశాయంటున్నారు. సింగరేణిని దశలవారీగా ప్రైవేటీకరించే ప్లాన్ లో కేసీఆర్ ఉన్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క్ ఫైర్ అవుతున్నారు. సింగరేణిని ప్రైవేట్ వారికి అప్పనంగా అప్పచెబుతూ అంతర్గతంగా కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులను ప్రోత్సహిస్తూ సంస్థను బలి చేస్తున్నారంటూ మండిపడుతున్నారు. ఇతర రాష్ట్రాల్లో బొగ్గు బ్లాకులను వేలంలో దక్కించుకొని బొగ్గు ఉత్పత్తికి పోటీపడే సింగరేణి యాజమాన్యం.. తెలంగాణలో బొగ్గు ఉత్పత్తి విషయంలో మాత్రం చూసిచూడనట్లుగా ఎందుకు ఉంటోందని ప్రశ్నిస్తున్నారు. బీజేపీ-బీఆర్ఎస్ ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటూ రాజకీయంగా పబ్బం గడుపుకుంటున్నారని, కార్మికులను గందరగోళ పరచడం తప్ప చేసిందేమీ లేదంటున్నారు.