Kavitha and Arvind: నిజామాబాద్ వార్ హైదరాబాద్ లో వాడివేడిగా సాగుతోంది. కవిత వర్సెస్ అర్వింద్ ఎపిసోడ్ దాడులకు దారి తీసింది. ఓటమి భారంతో మూడేళ్లుగా రగిలిపోతున్న కవిత.. ఛాన్స్ దొరికిందంటూ అర్వింద్ పై ఎదురుదాడి స్టార్ట్ చేశారు. ఆమె అనుచరులు అర్వింద్ ఇంటిపై దాడి చేసి విధ్వంసం సృష్టించడం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. పిచ్చిపిచ్చి వేషాలు వేస్తే చెప్పుతో కొడతా.. అంటూ ధర్మపురి అర్వింద్ కు కవిత స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడం కలకలం రేపుతోంది.
అర్వింద్ ఊరుకుంటారా? అదే రేంజ్ లో రెచ్చిపోయారు. ఆయనకు మద్దతుగా కమలదళం సైతం వాయిస్ పెంచింది. బండి సంజయ్, డీకే అరుణలు టీఆర్ఎస్ కు గట్టి హెచ్చరికలు చేశారు. ఇలా కవిత వర్సెస్ అర్వింద్ గొడవ.. తెలంగాణలో పొలిటికల్ హీట్ పెంచేసింది.
పార్టీ మారతానని అడ్డమైన కూతలు కూస్తే నిజామాబాద్ చౌరస్తాలో నిలబెట్టి చెప్పుతో కొడతానని అన్నారు కవిత. ఇంకోసారి గీత దాటితే ఊరుకోనని హెచ్చరించారు. అరవింద్ ఎక్కడ పోటీ చేసినా వెంటాడి ఓడిస్తానని సవాల్ చేశారు.
ధర్మపురి సైతం ధూంధాంగా రియాక్షన్ ఇచ్చారు. వ్యాఖ్యలు చేస్తే దాడి చేస్తారా? ఇలా ఇంటిపై దాడి చేయడం సమంజసమేనా? మేం ఎవరినీ వదిలిపెట్టం.. ఎప్పుడేం చేయాలో అది చేస్తాం.. అంటూ రివర్స్ అటాక్ చేశారు. ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు, ఇంటి సిబ్బంది దాడి చేసే హక్కు ఆమెకు ఎవరిచ్చారని ప్రశ్నించారు. కేసీఆర్, కేటీఆర్, కవిత.. విపరీతమైన కుల అహంకారంతో మాట్లాడుతున్నారని.. ఇదేమన్నా దొరల పాలన అనుకుంటున్నారా? అంటూ మండిపడ్డారు. తాను దేనికైనా సిద్ధంగా ఉన్నానని.. ఆమెపై పోటీ చేసేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని.. 2024 ఎన్నికల కోసం ఎదురుచూస్తున్నా.. అంటూ అర్వింద్ సవాల్ చేశారు.
కవితను పార్టీలో చేరాలని బీజేపీ నేతలు అడిగినట్టు సీఎం కేసీఆరే చెప్పారని.. మరి ఆయన ఇంటిపై ఎందుకు దాడి చేయలేదని ధర్మపురి అర్వింద్ ప్రశ్నించారు. కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు ఆమె కాంగ్రెస్లో చేరుతున్నట్టు తనకు స్వయంగా ఫోన్ చేసి చెప్పారని.. ఈ విషయంపైనా విచారణ చేస్తే బాగుంటుందని.. అందరి ఫోన్లను ట్యాప్ చేస్తున్నారు కదా.. కవితదీ ట్యాప్ చేస్తే విషయం తేలిపోతుందంటూ అర్వింద్ అన్నారు. దమ్ముంటే 2024 ఎన్నికల్లో కవిత తనపై పోటీ చేసి గెలవాలంటూ సవాల్ చేశారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్.
అర్వింద్ కు సపోర్ట్ గా బీజేపీ అధ్యక్షులు బండి సైతం రంగంలోకి దిగారు. మా కార్యకర్తలు బరిలోకి దిగితే తట్టుకోలేరు.. గడీల గూండా దాడులకు భయపడతామని అనుకుంటున్నారా? అంటూ మండిపడ్డారు.
ధర్మపురి అర్వింద్ కుటుంబానికి టీఆర్ఎస్ నుంచి ప్రాణహాని ఉందంటూ బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆరోపించారు. దాడికి కారణమైన కవితపై పోలీసులు కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.