Bandi Sanjay : టెన్త్ హిందీ పేపర్ లీకేజీ కేసులో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ను అరెస్ట్ చేయడం రాష్ట్రంలో రాజకీయ దుమారం రేపింది. అర్ధరాత్రి కరీంనగర్ లో అరెస్ట్ చేసిన పోలీసులు బండి సంజయ్ ను తొలుత యాదాద్రి భువనగిరి జిల్లాలోని బొమ్మలరామారం పోలీస్ స్టేషన్ కు తరలించారు. అక్కడకు బీజేపీ నేతలు , కార్యకర్తలు చేరుకుని ఆందోళనలు చేయడంతో ఉద్రిక్తత ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో బండి సంజయ్ ను నల్గొండకు తరలిస్తారని తొలుత ప్రచారం జరిగింది. కానీ చివరకు పాలకుర్తికి తరలించారు. అక్కడే వైద్య పరీక్షలు నిర్వహించారు.
సంజయ్ను తరలిస్తుండగా పెంబర్తి వద్ద పోలీసుల కాన్వాయ్ను బీజేపీ శ్రేణులు అడ్డుకున్నాయి. రోడ్లపై టైర్లు తగలబెట్టాయి. దీంతో పోలీసులు వారిపై లాఠీచార్జ్ చేశారు. ఈ క్రమంలో పలువురు బీజేపీ నేతలకు గాయాలయ్యాయి. పెంబర్తి నుంచి వరంగల్ పోలీసులు రంగంలోకి దిగి బండి సంజయ్ను పాలకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్య పరీక్ష నిర్వహించారు.
రంగంలోకి బీజేపీ అధిష్టానం..
బండి సంజయ్ అరెస్ట్ను బీజేపీ సీరియస్గా తీసుకుంది. ఈ క్రమంలో హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ను బీజేపీ లీగల్ సెల్ దాఖలు చేసింది. చీఫ్ జస్టిస్ నివాసానికి వెళ్లి ఈ పిటిషన్ దాఖలు చేసింది. కేంద్రమంత్రి కిషన్రెడ్డి డీజీపీకి ఫోన్ చేశారు. సంజయ్ను ఎందుకు అరెస్ట్ చేశారని ప్రశ్నించారు. కేసుకు సంబంధించిన వివరాలను కాసేపట్లో చెబుతానని డీజీపీ అంజనీకుమార్ అనటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కారణం లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారని కిషన్రెడ్డి ప్రశ్నించారు. ఏ కేసులో అరెస్ట్ చేశారో డీజీపీకి తెలియకపోవడం..పోలీసుల పనితీరుకు నిదర్శనమని కిషన్రెడ్డి విమర్శించారు. బీజేపీ అధిష్టానం కూడా బండి సంజయ్ అరెస్ట్పై వివరాలు అడిగి తెలుసుకుంటోంది. ఈ వ్యవహారంపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆరా తీశారు. తెలంగాణలో పరిస్థితులు తెలుసుకుని అమిత్ షాకు నడ్డా వివరించారు.
బీఆర్ఎస్ కౌంటర్ ఎటాక్..
బండి సంజయ్ అరెస్ట్ పై బీఆర్ఎస్ నేతలు ఎదురుదాడికి దిగారు. రాజకీయ కోణంలో మాత్రమే పేపర్ లీక్ అవుతోందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. టెన్త్ పేపర్ ఎవరు లీక్ చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బీజేపీ అనుకూల ఉపాధ్యాయ సంఘం నేత తెలుగు పేపర్ లీక్ చేశారని ఆరోపించారు. హిందీ పేపర్ లీక్ కు పాల్పడిన ప్రశాంత్ మొదట పేపర్ను బండి సంజయ్కే పంపారన్నారు. బండి సంజయ్ డబ్బులు ఇచ్చి మరి పేపర్ లీకులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
విద్యార్థుల జీవితాలతో బీజేపీ చెలగాటం ఆడుతోందని మంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పదో తరగతి పిల్లలతో క్షుద్ర రాజకీయాలకు పాల్పడుతోందని అన్నారు. బాలల భవిష్యత్తుతో ఎవరైనా ఆడుకుంటారా అని హరీశ్ రావు ప్రశ్నించారు. దమ్ముంటే రాజకీయంగా కొట్లాడాలని సవాల్ చేశారు. పేపర్ లీకు వ్యవహారంలో బండి సంజయ్, బీజేపీ పార్టీ దొరికిపోయాయని హరీశ్ రావు అన్నారు. వాట్సప్లో ప్రశ్నపత్రం పెట్టిన నిందితుడు ప్రశాంత్ బీజేపీ కార్యకర్తా? కాదా? సంజయ్కు అతడు ప్రశ్నపత్రం పంపించింది నిజమా? కాదా? రోజుకో పేపర్ లీకేజీ పేరుతో బీజేపీ కుట్రలు పన్నిన మాట వాస్తవమా? కాదా? అని ప్రశ్నించారు. సంజయ్కు ప్రశ్నపత్రం పంపిన ప్రశాంత్.. 2 గంటల్లో 142 సార్లు ఫోన్లో మాట్లాడాడని.. సంజయ్కు కూడా ఫోన్ చేశాడని ఆరోపించారు. దీనికి బీజేపీ నేతలు సూటిగా సమాధానం చెప్పాలని హరీశ్రావు డిమాండ్ చేశారు.
కేటీఆర్ ట్విట్టర్ వేదికగా సంచలన కామెంట్స్ చేశారు. ‘పిచ్చోని చేతిలో రాయి ఉంటే.. వచ్చి పోయేటోళ్ళకే ప్రమాదం. కానీ అదే పిచ్చోని చేతిలో ఒక పార్టీ ఉంటే ప్రజాస్వామ్యానికే ప్రమాదం. తమ స్వార్థ రాజకీయాల కోసం ప్రశ్నాపత్రాలు లీకు చేసి అమాయకులైన విద్యార్ధుల, నిరుద్యోగుల జీవితాలతో బీజేపీ నాయకులు చెలగాటం ఆడుతున్నారు’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.