Pinapaka : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పినపాక నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో ఉంది. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆ ప్రభావం పెద్దగా ఇక్కడ కనిపించలేదు.ఈ ప్రాంత పరిధిలోని ముణుగూరులో సింగరేణి బొగ్గు గనులు ఉన్నాయి.
పినపాక ST రిజర్వర్డ్ నియోజకవర్గం. ఇది మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉంది. 2009లో కొత్తగా పినపాక నియోజకవర్గం ఏర్పాటైంది. అప్పుడు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి రేగా కాంతారావు గెలిచారు. పినపాకలో బలమైన నేతగా ఉన్న ఆయనకు 2014లో ఎమ్మెల్యే టిక్కెట్ దక్కలేదు. సీట్ల సర్దుబాటులో ఈ సీటును సీపీఐకు కాంగ్రెస్ ఇచ్చింది.
2014లో పినపాకలో వైసీపీ బలంగా ఉంది . అందుకే తెలంగాణ ఏర్పాటు తర్వాత జరిగిన 2014 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి పాయం వెంకటేశ్వర్లు విజయం సాధించారు. ఇక్కడ మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి మంచి పట్టుఉంది. 2014లో పొంగులేటి ఖమ్మం నుంచి వైసీపీ తరఫున ఎంపీగా గెలిచారు. ఆయన ప్రభావం పినపాకలో కనిపించింది. కాంగ్రెస్ ఓట్లు వైసీపీకి బదిలీ కావడం కలిసొచ్చింది. ఫలితంగా పాయం వెంకటేశ్వర్ల సులభంగా గెలిచారు. కొంతకాలం తర్వాత ఆయన గులాబీ గూటికి చేరారు.
2018లో మరోసారి రేగా కాంతారావు కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగారు. పాయం వెంకటేశ్వర్లు బీఆర్ఎస్ నుంచి పోటీ చేశారు. వార్ వన్ సైడ్ అయ్యింది. రేగా కాంతారావు భారీ మెజార్టీతో రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత ఆయన కూడా పార్టీ ఫిరాయించి గులాబీ గూటికి చేరారు.
పినపాక అసెంబ్లీ స్థానంలో సిట్టింగ్ ఎమ్మెల్యే రేగా కాంతారావు, మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు బలమైన నేతలుగా ఉన్నారు. పాయం వెంకటేశ్వర్లు 2009లో సీపీఎం అభ్యర్థిగా బరిలోకి దిగారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత కారెక్కి.. 2018లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు.ఇప్పుడు కాంగ్రెస్ టిక్కెట్ రేసులో ఉన్నారు. ఇక్కడ నుంచే ములుగు ఎమ్మెల్యే సీతక్క తనయుడు సూర్య టిక్కెట్ ఆశించడం ఆసక్తిగా మారింది. ఇంతవరకు జరిగిన మూడు ఎన్నికల్లో ఒక్కసారి కూడా బీఆర్ఎస్ గెలవకపోవడం ఆసక్తికరం.
పినపాక నియోజకవర్గంలో ముణగూరు మున్సిపాలిటీతోపాటు పినపాక, ముణుగూరు, గుండాల, బూర్గమ్ పహాడ్, అశ్వాపురం, కరకగూడెం, ఆళ్లపల్లె మండలాలున్నాయి. 2018 ఎన్నికల నాటికి మొత్తం ఓటర్ల సంఖ్య లక్షా 67 వేల 676.
ప్రస్తుతం పినపాకలో ఓటర్ల సంఖ్య లక్షా 94,145 మందికి పెరిగింది. ఇందులో పురుషుల కంటే మహిళలే ఎక్కువ. పురుష ఓటర్లు 95, 704 మంది, మహిళా ఓటర్లు 98, 235 మంది, ట్రాన్స్ జెండర్స్ నలుగురు, సర్వీస్ ఓటర్లు 202 మంది ఉన్నారు. గత ఎన్నికల కంటే 26,469 ఓట్లు ఎక్కువగా ఉన్నాయి.
ఈ సెగ్మెంట్ లో గిరిజన జనాభా ఎక్కువ. ఆ తర్వాత ఎస్సీలు, యాదవుల ప్రాబల్యం బలంగా ఉంది. ఈ సెగ్మెంట్ లో ఎస్టీలు 40 శాతం , ఎస్సీలు 18 శాతం, యాదవులు 8 శాతం, ముదిరాజ్ 6 శాతం, పద్మశాలీలు 5 శాతం ఉన్నారు.