IT and ED Raids : ఫాంహౌజ్ కేసులో సిట్ యమ స్పీడ్ గా పని చేస్తోంది. ఏకంగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ కే నోటీసులు ఇచ్చింది. త్వరలోనే అరెస్టుకు రెడీ అవుతోందని తెలుస్తోంది. రాష్ట్ర దర్యాప్తు సంస్థ సిట్ ఇంత దూకుడుగా ఉంటే.. తామేమైనా తక్కువా అన్నట్టు కేంద్ర దర్యాప్తు సంస్థలు సైతం దడదడలాడిస్తున్నాయి. మంత్రి మల్లారెడ్డి కుటుంబ సభ్యుల ఇళ్లు, కార్యాలయాలపై ముమ్మర తనిఖీలు చేస్తున్నాయి. పైకి వేరు వేరుగా కనిపించినా.. ఈ రెండు ఘటనలకు లింక్ ఉందని అంటున్నారు.
మునుగోడు ఎన్నిక, ఫాంహౌజ్ కేసు వెలుగులోకి వచ్చినప్పటి నుంచే తెలంగాణలో ఈడీ, ఐటీ దాడులు పెరగడం యాధృచ్చికం కాకపోవచ్చు. మంత్రి గంగుల కమలాకర్ టార్గెట్ గా గ్రానైట్ వ్యాపారులపై ఈడీ, ఐటీ రైడ్స్ జరిగాయి. ఆ తర్వాత క్యాసినో కేసులో మళ్లీ దూకుడు పెంచి మంత్రి తలసాని సోదరులను ఈడీ ప్రశ్నించింది. లేటెస్గ్ గా మంత్రి మల్లారెడ్డి. ఇలా రెండు వారాల వ్యవధిలోనే.. ముగ్గురు టీఆర్ఎస్ మంత్రుల ఆస్తులపై దాడులు జరగడం సాధారణ విషయంగా చూడలేమంటున్నారు. ఇది పక్కా టార్గెట్ టీఆర్ఎస్ అని అనుమానిస్తున్నారు.
మీరు సిట్ అంటే.. మేము ఐటీ, ఈడీ అంటాం అన్నట్టుగా సాగుతోంది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్య యుద్ధం. తమ ఎమ్మెల్యేలను కొనాలనే ప్రయత్నం చేశారంటూ బీజేపీపై గుర్రుగా ఉన్నారు గులాబీ బాస్. ఫాంహౌజ్ కేసు వీడియోలను దేశంలోని రాజ్యాంగ వ్యవస్థలన్నిటికీ పంపించి.. బీజేపీ ఇమేజ్ ను బాగానే డ్యామేజ్ చేశారు కేసీఆర్. అక్కడితో ఆగకుండా సిట్ ఏర్పాటు చేసి.. నేరుగా బీజేపీ బిగ్ లీడర్ నే టార్గెట్ చేశారు. ఆర్ఎస్ఎస్ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చి ప్రస్తుతం బీజేపీ టాప్ లీడర్ గా ఉన్న బీఎల్ సంతోష్ కు నోటీసులు ఇవ్వడం, లుక్ అవుట్ నోటీసులు ఇవ్వడమంటే మామూలు విషయం కాదు. మోదీ, అమిత్ షా ఎంత పవర్ ఫుల్లో బీఎల్ సంతోష్ కు కూడా అంతే పవర్. అలాంటి బడా లీడర్ ను.. ఫాంహౌజ్ కేసులో సిట్ ముందుకు రప్పించే ప్రయత్నం చేస్తుండటాన్ని.. బీజేపీ తట్టుకోలేకపోతోందనేది టీఆర్ఎస్ నేతల ఆరోపణ. అందుకే కావాలనే.. వరుసబెట్టి రాష్ట్ర మంత్రులే టార్గెట్ గా ఈడీ, ఐటీ దాడులు చేస్తోందని మండిపడుతున్నారు. అయితే, తప్పు చేస్తే తనిఖీలు చేయడం తప్పా.. అనేది కమలనాథుల ప్రశ్న.
గంగుల, తలసాని, మల్లారెడ్డి.. ఆర్థికంగా అత్యంత బలంగా ఉన్న మంత్రులపై దాడులు చేస్తుండటం అధికార పార్టీలో ప్రకంపణలు రేపుతున్నాయి. ఇలాంటి తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదంటూ టీఆర్ఎస్ నేతలు చెబుతున్నా.. లోలోన మాత్రం ముచ్చెమటలు పడుతున్నాయంటున్నారు. ఇటీవల సీఎం కేసీఆర్ సైతం మంత్రులపై ఐటీ, ఈడీ దాడులు జరుగుతాయని, వాటికి భయపడవద్దంటూ నేతలకు ధైర్యం చెప్పినా.. ఎవరి భయం వారిదే. ఇలా, సిట్ వర్సెస్ ఈడీ+ఐటీ వార్ రాజకీయంగా ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో? సిట్ దూకుడు తగ్గిస్తేనే.. ఈడీ, ఐటీ దాడులు ఆగుతాయా?