KTR: రాజకీయాల్లో ఏ చిన్న పొరబాటు చేసినా అది పెద్ద డ్యామేజీ చేస్తుంది. మాట మరింత మంట రేపుతుంది. అందుకే, ఆచితూచి మాట్లాడుతుంటారు నేతలు. నోరు జారారో.. ప్రత్యర్థి పార్టీలకు చిక్కినట్టే. గతంలో బీకాంలో ఫిజిక్స్ డైలాగ్ ఎంత వైరల్ అయిందో గుర్తే ఉంటుంది. గులాబీ బాస్ కేసీఆర్ మాటల మాంత్రికుడు. ఆయన తనయుడు కేటీఆర్ కు సైతం మంచి వాగ్దాటి. కవిత, హరీష్.. ఇలా కేసీఆర్ కుటుంబంలో అందరికీ వాక్చాతుర్యమే. అంత ఈజీగా ప్రత్యర్థులకు ఛాన్స్ ఇవ్వరు వారు. ఇచ్చారంటే.. దాని వెనుక ఏదో వ్యూహమే ఉండి ఉంటుందని అంటుంటారు.
లేటెస్ట్ గా.. మంత్రి కేటీఆర్ తన సహజశైలికి భిన్నంగా బండి సంజయ్ పై చెప్పుతో కొడతా..లాంటి పరుష పదజాలంతో విరుచుకుపడ్డారు. ఇటీవల ఎమ్మెల్సీ కవిత సైతం.. బీజేపీ ఎంపీ అర్వింద్ ను ఇలానే చెప్పుతో కొడతా.. అని మండిపడింది. ఆ మాటలు వారిలోని భయాందోళన, ఫ్రస్టేషన్ కు నిదర్శనం అనేది బీజేపీ విమర్శ.
డ్రగ్స్ టెస్టు కోసం కావాలంటే తన రక్తం, గోర్లు, వెంట్రుకలు, చర్మం, కిడ్నీ.. ఏదికావాలంటే అది ఇస్తానంటూ బండి సంజయ్ కు కేటీఆర్ చేసిన సవాల్ తీవ్ర కలకలం రేపింది. ఏదాడి తర్వాత ఇప్పుడు స్పందించడం ఏంటి? శరీరంలో డ్రగ్స్ ఆనవాళ్లు 3 నెలలు మాత్రమే ఉంటాయి కాబట్టి ఇప్పుడు శాంపిల్స్ ఇస్తానంటున్నారు.. విదేశాల్లో డి అడిక్షన్ ట్రీట్ మెంట్ చేయించుకున్నారు.. అంటూ బీజేపీ నేతలు వరుసబెట్టి ఎదురుదాడి చేస్తున్నారు. వారి కౌంటర్లు వింటుంటే.. నిజమే కాబోలు అనేలా ఉన్నాయని.. ఈ విషయంలో కేటీఆర్ అడ్డంగా బుక్ అయ్యారని అంటున్నారు.
అదేంటి? కేటీఆర్ అసందర్భంగా అలా అనేశారేంటి? ఇటీవల ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి మీదనే బండి సంజయ్ డ్రగ్స్ ఆరోపణలు చేశారు. కేసులు తప్పవంటూ హెచ్చరించారు. చాలాకాలంగా డ్రగ్స్ ఎపిసోడ్ లో కేటీఆర్ ను నేరుగా టార్గెట్ చేయలేదు కమలనాథులు. అయినా, ఇప్పుడు కేటీఆర్ ఎందుకలా స్పందించినట్టు? ఎప్పుడే ఏడాది క్రితం జరిగిన దానిపై.. ఇప్పుడిలాంటి రియాక్షన్ ఎందుకు ఇచ్చినట్టు? కేటీఆర్ అంత ఈజీగా నోరు జారారా? లేదంటే, కావాలనే అలా అన్నారా?
కేటీఆర్ కామెంట్ల కలకలం మొదలైన కొన్నిగంటలకే ఢిల్లీ లిక్కర్ స్కాం ఛార్జిషీట్ లో కవిత పేరు ప్రముఖంగా కనిపించింది. ఏకంగా 28 సార్లు ప్రస్తావన వచ్చింది. కొద్దిరోజులుగా తెలంగాణ రాజకీయం కవిత చుట్టూనే తిరుగుతోంది. అందుకే, చెల్లి కోసం అన్న.. కాంట్రవర్సీని క్రియేట్ చేశారా? కావాలనే డ్రగ్స్ విషయాన్ని మళ్లీ కదిలించి.. టాపిక్ ను తనవైపు డైవర్ట్ చేసుకున్నారా? అనే అనుమానమూ లేకపోలేదు. అయితే, కమలనాథులు ఈ యాంగిల్ లో అటాక్ చేస్తారని ఆయన ముందు ఊహించి ఉండకపోవచ్చని అంటున్నారు.
మరోవైపు, కేటీఆర్ వ్యాఖ్యల వెనుక వ్యూహమేమీ ఉండకపోవచ్చని.. ఆయన నోరు జారి.. ఎరక్కపోయి ఇరుక్కున్నారనేది కొందరి వాదన. ఏదిఎలా ఉన్నా.. డ్రగ్స్ ఎపిసోడ్ లో ఈసారి కేటీఆర్ ఇమేజ్ కు భారీగానే డ్యామేజ్ అయిందని అంటున్నారు. ఆయన డ్రగ్స్ తీసుకున్నారో లేదో కానీ.. ఇన్నాళ్ల తర్వాత స్పందించడం.. శరీరంలో డ్రగ్స్ ఆనవాళ్లు పోయాక సవాల్ కు సిద్ధమయ్యారని బీజేపీ నేతలు కౌంటర్ అటాక్ కు దిగడంతో.. ఏమో.. నిజమేకావొచ్చు.. అనేలా ప్రచారం జరుగుతోంది.