TSPSC: టీఎస్పీఎస్సీ పరీక్షా పత్రాల లీకేజీ వ్యవహారం రాజకీయ దుమారం రేపుతోంది. ప్రభుత్వ వైఫల్యంపై విపక్షలు మండిపడుతుంటే.. నిరుద్యోగులు ఆందోళన చెందుతుండగా.. ఇప్పటికే ఓ అభ్యర్థి ఆత్మహత్య చేసుకోగా.. వివాదం మరింత ముదురుతోంది. లేట్గా స్పందించిన సీఎం కేసీఆర్.. ప్రగతిభవన్లో మంత్రులు, కమిషన్ అధికారులతో కీలక సమావేశం జరిపారు. తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఆ మీటింగ్ వివరాలను మంత్రి కేటీఆర్ వెల్లడించారు. పనిలో పనిగా రాజకీయ ఆరోపణలూ చేశారు కేటీఆర్.
పేపర్ లీకేజ్ కేసులో ఏ2 నిందితుడు రాజశేఖర్రెడ్డి ఈ కేసులో కీలకంగా మారాడు. అతని చుట్టూనే రాజకీయం నడుస్తోంది. నెట్వర్క్ ఎక్స్పర్ట్ అయిన రాజశేఖర్.. బీజేపీలో యాక్టివ్ లీడర్. అందుకే, పేపర్ లీకేజ్ వెనక బీజేపీ కుట్ర ఉందనే అనుమానం వ్యక్తం చేశారు కేటీఆర్. స్వయంగా మంత్రే ఇలాంటి ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది. ప్రశ్నాపత్రాల లీకేజీలో ప్రవీణ్, రాజశేఖర్రెడ్డిలే కాదు.. వారి వెనుక ఎవరున్నా వదిలేది లేదని.. కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు కేటీఆర్.
కమిషన్లో ఇద్దరు వ్యక్తులు చేసిన తప్పు మొత్తం వ్యవస్థకే చెడ్డపేరు తీసుకొచ్చిందని కేటీఆర్ ఆవేదన వ్యక్తంచేశారు. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. టీఎస్పీఎస్సీ పరీక్ష నిర్వహణను మరింత పకడ్బందీగా చేపట్టేందుకు చేయాల్సిన మార్పులను చేస్తామన్నారు. 4 పరీక్షలు రద్దయ్యాయని.. త్వరలోనే మళ్లీ నిర్వహిస్తామని.. అభ్యర్థులు ఎవరూ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని.. గతంలో దరఖాస్తు చేసుకున్నవారంతా పరీక్ష రాసేందుకు అర్హులేనని తెలిపారు. ఈ 4 పరీక్షలకు సంబంధించి కోచింగ్ మెటీరియల్ అంతా ఆన్లైన్లో పెడతామని.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స్టడీ సర్కిళ్లను మరింత బలోపేతం చేస్తామని.. రీడింగ్ రూమ్లను సైతం 24 గంటలూ తెరిచే ఉంచుతామని.. ఉచిత మెటీరియల్తో పాటు ఉచిత భోజన వసతి కూడా అందిస్తామని చెప్పారు కేటీఆర్. జిల్లా కలెక్టర్ వీటి నిర్వహణ బాధ్యతలు చూస్తారని అన్నారు.
మరోవైపు, ప్రతిపక్షాలు సైతం ప్రభుత్వాన్ని ఫుల్గా కార్నర్ చేస్తున్నాయి. పేపర్ లీకేజీ వ్యవహారంపై టీఎస్పీఎస్సీ ఛైర్మన్, కమిటీ సభ్యులు మూకుమ్మడిగా రాజీనామా చేయాలని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. ఇది కావాలని చేశారా? లేదా యాదృచ్ఛికంగా జరిగిందా? అనే విషయాన్ని సీఎం కేసీఆర్ స్పష్టం చేయాలన్నారు. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి.. బాధ్యులను కఠినంగా శిక్షించాలని ఈటల రాజేందర్ కోరారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై బీజేపీ నేతలు గవర్నర్ తమిళిసైను కలిసి ఫిర్యాదు చేశారు.
టీఎస్పీఎస్సీ పరీక్ష ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో బీఆర్ఎస్కు చెందినవారి హస్తం ఉందని టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి ఆరోపించారు. “రాష్ట్రంలో ఏ పరీక్ష చూసినా పేపర్ లీకులే. బీఆర్ఎస్ పైరవీకారులకు ముందే ప్రశ్నపత్రాలు అందుతున్నాయి. ఈ కేసులో చిన్న చేపలను బలి చేస్తున్నారు. పేపర్ లీకేజీకి కారణం కేటీఆర్. ఆయన్ను ఎందుకు మంత్రి పదవి నుంచి బర్త్రఫ్ చేయరు?” అని ప్రశ్నించారు రేవంత్రెడ్డి.
పరీక్ష పత్రాల లీకేజీ పరిణామాలతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగి నవీన్ కుమార్ కుటుంబానికి న్యాయం చేయాలని రేవంత్రెడ్డి డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్పై హత్యానేరం కింద కేసు పెట్టాలన్నారు. నవీన్ కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని.. వారికి రూ.కోటి పరిహారం ఇవ్వాలని రేవంత్రెడ్డి డిమాండ్ చేశారు.