Modi: ఈ రాజకీయ నాయకులు ఉన్నారే… కాదేదీ రాజకీయానికి అనర్హం అన్నట్టు ప్రతీ విషయాన్ని భలే వాడేసుకుంటారు. ఇప్పుడంతా ఆస్కార్ మేనియా నడుస్తుండటంతో.. పొలిటికల్ లీడర్లు కూడా ఆస్కార్కు లింకు పెట్టే రాజకీయం చేస్తున్నారు. రాజ్యసభలో కాంగ్రెస్ పక్ష నేత మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలు సభలో నవ్వులు పూయించాయి. దయచేసి ఆర్ఆర్ఆర్ సాంగ్కు మోదీ వల్లే ఆస్కార్ వచ్చిందంటూ.. ఆ క్రెడిట్ కూడా మీ ఖాతాలోనే వేసుకోవద్దంటూ చేతులు జోడించి మరీ ఖర్గే చేసిన విన్నపానికి బీజేపీ సభ్యులతో సహా అంతా నవ్వేశారు. ఖర్గే డైలాగ్ కాస్త కామెడీ టచ్ ఇచ్చినా.. తెలంగాణ మంత్రి కేటీఆర్ మాత్రం మోదీ టార్గెట్గా ఆస్కార్కు లింకు పెడుతూ హాట్ కామెంట్స్ చేశారు. కేటీఆర్ ఏమన్నారంటే…
మనదేశంలో అద్భుతమైన నటుడు ప్రధాని మోదీ అని, ఆస్కార్కు ప్రతిపాదనలు పంపితే మోదీకి ఉత్తమ నటుడు అవార్డు వచ్చేది అంటూ పంచ్లు వేశారు కేటీఆర్. దేశ సంపదంతా మిత్రుడు అదానీకి దోచిపెట్టి.. ఆయన నుంచి తన పార్టీకి చందాలు తీసుకుంటున్నారని విమర్శించారు. ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టి వేధిస్తున్నారని మండిపడ్డారు. మోదీకి, ఈడీకి భయపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఎవరు నీతిమంతులో.. ఎవరు అవినీతిపరులో ప్రజాక్షేత్రంలో 2023లో ప్రజలే తీర్పు చెబుతారంటూ సవాల్ చేశారు.
బీజేపీ తెలంగాణకు పట్టిన దరిద్రమన్నారు కేటీఆర్. రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఎన్నో హామీలు ఇచ్చారని.. ఇప్పటివరకు ఒక్కటి కూడా నెరవేర్చలేదని తప్పుబట్టారు. కేంద్ర ప్రభుత్వం రూ.70 ఉన్న పెట్రోల్ను రూ.115 చేసిందని.. గ్యాస్ సిలిండర్ ధర రూ.400 నుంచి రూ.1200కు పెంచిందంటూ కేటీఆర్ ఫైర్ అయ్యారు.
ఎన్నికలు వస్తేనే కాంగ్రెస్, బీజేపీ వాళ్లు తెలంగాణకు వస్తారని.. ఓట్లు వేయమని అడుగుతారని.. రాష్ట్రానికి ఏం సాయం చేయనివాళ్లకు ఓట్లు ఎందుకు వేయాలని ప్రశ్నించారు కేటీఆర్. 55 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ తెలంగాణకు ఏం చేసింది? ఇన్నేళ్లల్లో ఏమీ చేయని నాయకులకు మళ్లీ ఎందుకు అవకాశం ఇవ్వాలి? అని నిలదీశారు.
కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలోని నాగమడుగు ఎత్తిపోతల పథకానికి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. మంజీరా నదిపై నిర్మించిన వంతెనను ప్రారంభించారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ను గెలిపించి.. కేసీఆర్ను మూడోసారి సీఎం చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు కేటీఆర్.