కేసీఆర్, తమిళిసై ఉప్పునిప్పు. ప్రగతి భవన్, రాజ్ భవన్ల మధ్య కోల్డ్ వార్. ఏ ప్రభుత్వ కార్యక్రమానికీ గవర్నర్ను పిలవరు.. గవర్నర్ ఎక్కడికి వెళ్లినా సర్కారు ప్రోటోకాల్ పాటించదు. బిల్లుల ఆమోదం, ఎమ్మెల్సీ నియామకం తదితర అంశాల్లో రాజ్యాంగ పోరు నడిచింది. వారిద్దరి మధ్య మాటా లేదు, చర్చా జరగలేదు. కానీ, సడెన్గా సీన్ మారింది. పట్నం మహేందర్రెడ్డి మంత్రిగా ప్రమాణస్వీకార కార్యక్రమం గవర్నర్, సీఎం భేటీకి వేదికగా మారింది. కట్ చేస్తే, ఆ మర్నాడే మరో ముందడుగు పడింది. కొత్త సచివాలయానికి తమిళిసైని ఆహ్వానించడం, మూడు మతాల ప్రార్థనాలయాలను ప్రారంభించడం, సెక్రటేరియట్ మొత్తం దగ్గరుండి చూపించడం.. అబ్బో.. క్యా సీన్ హై. ఒకప్పటి బీజేపీ లీడర్తో.. గవర్నర్ హోదాలో చర్చి, మసీదు ఓపెనింగ్ చేయించడం మరింత ఆసక్తికరం అంటున్నారు.
ఏంటిది? సడెన్గా ఏం జరిగింది? తమిళిసై, కేసీఆర్ మధ్య అంతటి సఖ్యత ఎలా సాధ్యమైంది? ఇదే ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్. ఇన్నేళ్లుగా అంతలా వార్ నడిస్తే.. ఇప్పుడు జస్ట్ 15 నిమిషాల భేటీతో విభేదాలు హుష్కాకిలా ఎగిరిపోయాయా? అలా జరిగే అవకాశం ఉందా?
రకరకాల విశ్లేషణలు వినిపిస్తున్నాయి. సరిగ్గా ఎన్నికల ముందే ఇలా జరగడంతో ఇందులో రాజకీయ కోణమే ఎక్కువగా కనిపిస్తోందని అంటున్నారు. బీఆర్ఎస్, బీజేపీల మధ్య సీక్రెట్ దోస్తానా నడుస్తోందనే ఆరోపణలు ఉండనే ఉన్నాయి. లిక్కర్ కేసులో కవిత అరెస్ట్ కాకపోవడం.. బీజేపీపై ఉండే నమ్మకాన్ని వమ్ము చేసింది. అప్పటినుంచీ అన్నీ అనుమానపు చూపులే. బీజేపీ కోసమే తమను పక్కనపెట్టేశారని లేటెస్ట్గా కమ్యూనిస్టులు సైతం ఆరోపించారు. ఇప్పుడు సీఎం, గవర్నర్లు ఇలా కలిసిపోవడమూ.. ఆ ఖాతాలోనే కలిపేస్తున్నారు. ఆ రెండు పార్టీలు ములాకత్ అయ్యాయని అంటున్నారు.
ఇంకో వెర్షన్ కూడా ఉంది. సకాలంలో కొన్ని పనులు చక్కబెట్టుకోవడానికి.. సీఎం కేసీఆరే దిగొచ్చారని కూడా చెబుతున్నారు. పెండింగ్ బిల్లులు క్లియర్ చేసుకోవడం, గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థి విషయంలో ఈసారి కొర్రీ రాకుండా చూసుకోవడం కోసమే.. కేసీఆర్ తగ్గి..నెగ్గే ఎత్తుగడ వేశారని అంటున్నారు. తన అవసరం కోసం ఏదైనా చేసే చరిత్ర ఉన్న గులాబీ బాస్.. సీఎంగా గవర్నర్తో రాజీకి రావడంలో ఆశ్చర్యమేమీ లేదంటున్నారు.
ఇక, గవర్నర్ సైతం మొదటినుంచీ తన పదవికి తగిన గుర్తింపు ఇవ్వాలనే కోరుతున్నారు. రాజ్యాంగ హోదాను గౌరవించాలని పదే పదే సూచిస్తున్నారు. వ్యక్తిగతంగా ఎలాంటి భేదాభిప్రాయాలు లేవంటున్నారు. అందుకే, సీఎం కేసీఆర్ ఇలా దిగిరాగానే.. తమిళిసై అలా కలిసినడిచారు. కలిసి కార్యక్రమాలకు హాజరయ్యారు. గవర్నర్ గిరి ప్రకారమే నడుచుకున్నారు. అంతే. అంతేనా?
అయితే, వాళ్లిద్దరూ కలిసి పావుగంట మాట్లాడుకున్నంత మాత్రాన.. కొత్త సచివాలయంలో గుడి, మసీదు, చర్చిని ప్రారంభించినంత మాత్రాన.. కలిసిపోయినట్టు కాదనే వాళ్లూ ఉన్నారు. సీఎం ఆహ్వానించారు కాబట్టి గవర్నర్ వెళ్లారు. బిల్లుల ఆమోదానికి దీనికి సంబంధం ఉండకపోవచ్చని అంటున్నారు. నిబంధనల ప్రకారం ఉంటేనే ఆ బిల్లులకు ఆమోదం. కరెక్ట్ కేండిడేట్ అని భావిస్తేనే ఎమ్మెల్సీ నియామకానికి సమ్మతం. లేదంటే, మళ్లీ మొదటికే..నా?