Alampur Politics : గద్వాల జిల్లా అలంపూర్లో అధికార బీఆర్ఎస్ను అంతర్గత కుమ్ములాటలు కుదిపేస్తున్నాయి. ప్రధానంగా చల్లా వెంకట్రామిరెడ్డి ఆధిపత్యానికి చెక్ పెట్టాలని ద్వితీయ శ్రేణినేతలు కంకణం కట్టుకున్నారు. పట్టుబట్టి మరీ అబ్రహం టికెట్ లాగేసుకోవడం తీవ్ర కలకలం రేపింది. ఈ పరిణామాలకు తోడు సీనియర్ నేత మందా జగన్నాథం కాంగ్రెస్ పార్టీలో చేరడం సంపత్ కుమార్ విజయానికి కలిసిరానుంది.
ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గమైనా ఇంకా ఎన్నేళ్లు చల్లా వెంకట్రామిరెడ్డి కక్షపూరితమైన ధోరణితో రాజకీయాలు చేస్తారని గులాబీ సీనియర్లు ఆగ్రహంగా ఉన్నారు. అటు ఓటర్లు కూడా ఇదే ఆలోచనలో ఉన్నారు. ప్రధానంగా ఎస్సీ సామాజిక వర్గం అలంపూర్లో అధికార పార్టీ అరాచకాలకు అడ్డుకట్ట వేయాలని భావిస్తోంది.
ఉమ్మడి పాలమూరు జిల్లాలో అలంపూర్ అసెంబ్లీ సెగ్మెంట్ ఎస్సీ రిజర్వ్డ్ కావడం అక్కడి ముఖ్య నేతలకు తలనొప్పిగా మారింది. గతంలో ఇక్కడ గెలిచిన సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్రహంకు బీఆర్ఎస్ అధిష్టానం బి-ఫాం ఇవ్వకుండా మొండిచేయి చూపింది. ఎమ్మెల్సీ చల్లావెంకట్రామిరెడ్డి తన అనుచరుడు, విజేయుడికి బీ-ఫాం తెచ్చుకొని మరోసారి నియోజకవర్గంలో చక్రం తిప్పారు.
అప్పటి వరకు అబ్రహం లేదంటే తన కొడుకుకు అవకాశం వస్తుందనుకున్న మంధా జగన్నాథం గులాబీ పార్టీలో ఇమడలేక ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పకున్నారు. ఈ పరిణామాలు నియోజకవర్గ కాంగ్రెస్ శ్రేణుల్లో నూతనోత్సాహం తెచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో వున్న సంపత్ కుమార్ అలంపూర్లో కాంగ్రెస్ జెండాను ఎగురవేసి చల్లా వెంకట్రామిరెడ్డి ఆధిపత్యానికి చెక్ పెట్టడం ఖాయమనే చర్చ జరుగుతోంది. సీనియర్ నేత మందా జగన్నాథంతో కలిసి రాజకీయ ఎత్తుగడలు సిద్ధం చేసుకోవడం పార్టీ శ్రేణుల్లో జోష్ నింపుతోంది.
అలంపూర్ నియోజకవర్గంలో ఎప్పడు ఎన్నికలు జరిగినా శాసించేది చల్లా వెంకట్రామిరెడ్డి అనే టాక్ బలంగా నాటుకు పోయింది. ఆయన సపోర్ట్ ఉంటేనే ఎమ్మెల్యేగా గెలుస్తారన్నది నియోజకవర్గ ప్రజల భావన. కానీ, ప్రస్తుతం అక్కడ ఓటర్లు విలక్షణమైన తీర్పుకు సిద్ధమయ్యారు. రిజర్వ్డ్ నియోజకవర్గంలో చల్లా రాజకీయాలు ఎందుకని ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు. అబ్రహంకు బీ-ఫామ్ దక్కకుండా చేసిన కుట్రలపైనా స్థానికులు భగ్గుమంటున్నారు. ఈ పరిణామాలను అనుకూలంగా కాంగ్రెస్ పార్టీ మార్చుకుంటోంది.
దళితులను గులాబీ పార్టీ అణచివేస్తోందని జనంలోకి బలంగా తీసుకెళ్తోంది. అందుబాటులో ఉండే తనను గెలిపించాలని సంపత్ కుమార్ ప్రచారం ముమ్మరం చేశారు. అటు బీఆర్ఎస్ అభ్యర్థి విజేయుడికి ప్రచారంలో నిరసనలు ఎదురవుతున్నాయి. ప్రస్తుత ఎమ్మెల్యేకు బీ-ఫామ్ దక్కకుండా చేసిన చల్లా తీరుపై అబ్రహం వర్గం నాయకులంతా పార్టీ మారారు. కొంతమంది గులాబీ పార్టీలో పార్టీలో కొనసాగుతున్నారు. కొందరు బీఆర్ఎస్లో ఉండే విజేయుడి ఓటమికి పనిచేయాలని నిర్ణయించాకున్నారు.
ప్రధానంగా రేవంత్రెడ్డి ప్రజాగర్జన సభ తర్వాత నియోజకవర్గంలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. పెద్దఎత్తున చేరికలతో ఫలితాలు తారుమారయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. జెడ్పీటీసీలు, ఎంపీపీలు, 34 గ్రామాల ఎంపీటీసీలు, 16 గ్రామాల సర్పంచులు ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరారు. వాల్మీకి సంఘం నాయకులు 500కుపైగా వాహనాల్లో వెళ్లి రేవంత్రెడ్డి సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు.
నియోజకవర్గంలోని ద్వితీయ శ్రేణి నాయకులు హస్తం పార్టీకి మద్దతివ్వడంతో కాంగ్రెస్ మరింత పుంజుకుంది. బీఆర్ఎస్ మేనిఫెస్టో కంటే కాంగ్రెస్ ఇస్తున్న 6 గ్యారెంటీలను జనం అత్యధికంగా విశ్వసిస్తుండటం సంపత్ గెలుపు నల్లేరుపై నడకే అనే టాక్ నడుస్తోంది. మరోవైపు నియోజకవర్గంలో అగ్రకులాల ఆధిపత్యం వల్లే తాను రాజకీయాలకు దూరమవుతున్నానని ఎమ్మేల్యే అబ్రహం చేసిన వ్యాఖ్యలు స్థానికులను ఆలోచనలో పడేశాయి. అధికార పార్టీకి ఈసారి తగిన గుణపాఠం చెబుతామని ఓటర్లు పట్టుదలగా ఉన్నారనే చర్చ జరుగుతోంది.