Mohinabad : మొయినాబాద్ యువతి మృతి కేసులో ఎట్టకేలకు మిస్టరీ వీడింది. మృతురాలు మొయినాబాద్లోని మల్లేపల్లికి చెందిన యువతి తైసీల్ (22)గా గుర్తించారు. ఆమెను ఎవరూ చంపలేదని.. తానే సూసైడ్ చేసుకుందని పోలీసులు చెబుతున్నారు. అయితే ఈ కేసులో పోలీసుల నిర్లక్ష్య వైఖరిపై సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి ఫైర్ అయ్యారు.
హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ కు సాధారణ తనిఖీ చేసేందుకు వచ్చిన సీపీ.. మొయినాబాద్ యువతి మృతికి సంబంధించి వివరాలు తెలుసుకున్నారు. పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని గుర్తించారు. ఈ నెల 8 నుంచి ఆ యువతి కనిపించకుండా పోయింది. ఈ నెల 10న తైసీల్ కనిపించడం లేదని ఆమె సోదరుడు అజర్ ఫిర్యాదు చేశాడు. అయితే ఇప్పటి వరకు హబీబ్ నగర్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు.
విషయం తెలుసుకుని పీఎస్కు హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్రెడ్డి వెళ్లారు.ఈ ఘటనపై విచారణ జరుగుతుందని సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని సీపీ స్పష్టం చేశారు. ఈ తరహా ఘటనలను ఉపేక్షించేదిలేదన్నారు. సీపీ చెప్పినట్టుగానే హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ శివను సస్పెండ్ చేశారు. ఇన్స్పెక్టర్ రాంబాబుకు మెమో జారీ చేశారు.