RajaSingh: వదల బొమ్మాళీ స్టైల్ లో వెంటాడుతున్నారు పోలీసులు. ఎమ్మెల్యే రాజాసింగ్ ను మళ్లీ జైలుకు పంపించే వరకూ వదిలేలా లేరు. ఇప్పటికే పీడీ యాక్ట్ లో జైలుకు పంపి బెయిల్ పై బయటకు వచ్చిన రాజాసింగ్ కు లేటెస్ట్ గా 41ఏ సీఆర్పీసీ కింద పోలీసులు నోటీసులు ఇవ్వడం కలకలంగా మారింది.
పాత కేసును ఫ్రెష్ గా మళ్లీ తవ్వడం చూస్తుంటే.. కావాలనే టార్గెట్ చేస్తున్నారనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఎమ్మెల్యే అభిమానులు. గతేడాది ఆగస్టులో కంచన్ బాగ్ పోలీస్ స్టేషన్లో రాజాసింగ్ పై ఓ కేసు నమోదైంది. అజ్మీర్ దర్గాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారనేది ఆరోపణ. అయితే, ఆ కేసులో ఇప్పుడు నోటీసులు ఇచ్చేందుకే అన్నట్టు.. ఆ కేసును కంచన్ బాగ్ నుంచి మంగళ్ హాట్ పీఎస్ కు బదిలీ చేశారు. తాజాగా, మంగళ్ హాట్ పోలీసులు వివాదాస్పద వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలంటూ ఎమ్మెల్యే రాజాసింగ్ కు నోటీసులు పంపడంపై రాజకీయ చర్చ నడుస్తోంది.
బీజేపీలో సస్పెన్షన్ లో ఉన్న రాజాసింగ్ కు ఆ పార్టీ అధికారికంగా మద్దతు ఇచ్చే పరిస్థితి లేదు. ఇలాంటి బలహీన సమయాన కావాలనే రాజాసింగ్ ను కార్నర్ చేయాలని చూస్తున్నారంటూ విమర్శలు వస్తున్నాయి. ఎలాగైనా తమ నేతను మళ్లీ జైలుకు పంపించి.. ఓవైసీ కళ్లల్లో ఆనందం చూడాలనేదే ప్రభుత్వ ప్రయత్నమని రాజాసింగ్ అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.